నేటితో గడువు పూర్తి
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:15 PM
పోలింగ్ విధులు నిర్వహించే ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు (ఫారం-12) అందించడానికి నేటితో గడువు ముగియనుంది.
సాలూరు రూరల్, ఏప్రిల్ 25: పోలింగ్ విధులు నిర్వహించే ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు (ఫారం-12) అందించడానికి నేటితో గడువు ముగియనుంది. అయితే ఇప్పటికే కురుపాం, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాల్లో పలువురు తమకు పోస్టల్ బ్యాలెట్ కావాలని దరఖాస్తులందించారు. వాస్తవంగా పోస్టల్ బ్యాలెట్ల దరఖాస్తుల స్వీకరణకు తొలుత గడువు ఈ నెల 15 కాగా దానిని 22కు పొడిగించారు. ఆ తర్వాత ఈ గడువును 26కు పెంచారు. సాలూరులో గురువారం నాటికి 412 మంది ఉద్యోగులు తమకు పోస్టల్ బ్యాలెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. నేడు పూర్తిస్థాయిలో దరఖాస్తులు రావొచ్చని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. జిల్లాలో 769 ప్రాంతాల్లో 1031 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. వాటిల్లో వచ్చే నెల 13న పోలింగ్ నిర్వహణకు గాను 1240 మంది పీవోలు, 1199 ఏపీవోలు, దాదాపు 4000 మంది ఓపీవో ( అదర్ పోలింగ్ ఆఫీసర్లు )ను నియమించారు. వారంతా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులు ( ఫారమ్ 12) చేసుకోవాల్సి ఉంది.