మధ్యవర్తిత్వమే మేలు
ABN , Publish Date - Feb 26 , 2024 | 12:23 AM
న్యాయస్థానం ఆశ్రయించిన వారు ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించేందుకు న్యాయవాదులు ప్రయత్నించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనరసింహ అన్నారు.
![మధ్యవర్తిత్వమే మేలు](https://media.andhrajyothy.com/media/2024/20240224/25vzp20a_d04e4a3b76.gif)
మధ్యవర్తిత్వమే మేలు
ఆ వైపుగా న్యాయవాదులు ప్రయత్నించాలి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనరసింహ
జిల్లా కోర్టు భవన సముదాయానికి శంకుస్థాపన చేసిన న్యాయమూర్తులు
విజయనగరం(ఆంధ్రజ్యోతి), ఫిబ్రవరి 25 : న్యాయస్థానం ఆశ్రయించిన వారు ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించేందుకు న్యాయవాదులు ప్రయత్నించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనరసింహ అన్నారు. పాత జిల్లా కోర్టు ఆవరణలో నిర్మించనున్న జిల్లా కోర్డు కాంప్లెక్స్ నూతన భవన సముదాయానికి ఆయనతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదివారం శంఖుస్థాపన చేశారు. భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.99.20 కోట్లు మంజూరు చేసింది. 6.58 ఎకరాల్లో ఆరు అంతస్తుల్లో ఆర్అండ్బీ ఆధ్వర్యంలో భవనం నిర్మించనున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ శ్రీనరసింహ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా న్యాయవాదులు వివాదాల పరిష్కారంలో మెలకువలను తెలుసుకోవాలన్నారు. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్న యువతీయువకులు జిల్లా కోర్టులో తమవృత్తిని ప్రారంభించేలా సీనియర్ న్యాయవాదులు వారిని ప్రోత్సహించాల్సి ఉందన్నారు. నూతన కోర్టు భవనాల ద్వారా మంచి వసతులు సమకూరనున్నాయని, వీటిని వినియోగించుకుంటూ న్యాయవాదులు సమాజానికి సేవలందించాలన్నారు. ఎందరోకవులు, రచయితలు, విద్యావేత్తలు జన్మించిన స్థలం విజయనగరమని చెప్పారు.
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ఠాకూర్ మాట్లాడుతూ న్యాయస్థానం అంటే న్యాయానికి కోవెలవంటిదన్నారు. కోర్టు భవనం వీలైనంత త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలోని కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం రూ.186 కోట్లు కేటాయించిందని, తొలి విడతగా రూ.45 కోట్లు విడుదల చేయగా రాష్ట్రప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ రూ.30 కోట్లు అందజేసిందని చెప్పారు.
- హైకోర్టు జడ్జి జస్టిస్ యూ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ విజయనగరం ప్రాంత చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించేలా న్యాయస్థాన భవనాలకు ఆకృతులను ఇవ్వడంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక శ్రద్ధ చూపారని తెలిపారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ మాట్లాడుతూ భవన నిర్మాణం సకాలంలో పూర్తయ్యేలా సహకారం అందిస్తామన్నారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లా కోర్టు భవనాలను రెండేళ్ల వ్యవధిలో పూర్తిచేసేలా జిల్లా యంత్రాంగం ద్వారా సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా పోర్టుపోలియో అధికారి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన న్యాయాధికారి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి, జేసీ కార్తీక్, ఎస్పీ దీపిక తదితరులు పాల్గొన్నారు.