Share News

లారీ క్యాబిన్‌లో గంజాయి

ABN , Publish Date - Mar 20 , 2024 | 11:52 PM

గంజాయి సాగుకు పేరొందిన అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి మరోసారి భారీ స్థాయిలో లారీ క్యాబిన్‌లో గంజాయి తరలుతూ జిల్లాలో పట్టుబడింది. ఈసారి స్మగ్లర్లు గంజాయిని బెనారస్‌ తరలించాలని భావించారు.

లారీ క్యాబిన్‌లో గంజాయి
గంజాయితో స్వాధీనం చేసుకున్న లారీ

లారీ క్యాబిన్‌లో గంజాయి

350 కిలోలను పట్టుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో

బొడ్డవర చెక్‌పోస్టు దాటిన తరువాత గుర్తింపు

గంజాయి విలువ రూ.50లక్షలపైనే..

శృంగవరపుకోట, మార్చి 20 : గంజాయి సాగుకు పేరొందిన అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి మరోసారి భారీ స్థాయిలో లారీ క్యాబిన్‌లో గంజాయి తరలుతూ జిల్లాలో పట్టుబడింది. ఈసారి స్మగ్లర్లు గంజాయిని బెనారస్‌ తరలించాలని భావించారు. డబ్బులు కోసం రవాణాకు అంగీకరించిన లారీ డ్రైవర్‌ అడ్డంగా దొరికిపోయాడు. ఎస్‌.కోట మండలం బొడ్డవర చెక్‌పోస్టు దాటిన తరువాత లారీని తనిఖీ చేసి రూ.50లక్షలు పైగా విలువ చేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సూత్రదారుల కోసం ఆరా తీస్తున్నారు. ఎస్‌ఈబీ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ బీబీజీ రాజు, సీఐ సంతోష్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

రాజస్థాన్‌కు చెందిన లారీ డ్రైవర్‌ ఖాన్‌ ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి తన లారీలో పొక్లైనర్‌ను బుధవారం తీసుకొచ్చాడు. ఎన్‌ఏడీకి సమీపంలో దించేసి తిరిగి ప్రయాణమయ్యాడు. అంతలో డ్రైవర్‌కు ఫోన్‌ వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల సమీపంలో ఒక గ్రామానికి వెళ్లాలని, అక్కడ గంజాయి ఉంటుందని, దానిని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బెనారస్‌లో అప్పగించాలని గుర్తుతెలియని వ్యక్తులు కోరారు. కిరాయి మాట్లాడుకున్న డ్రైవర్‌ అదనంగా ఆదాయం వస్తుందని ఆశ పడి ఆ గ్రామానికి వెళ్లాడు. అక్కడ 350 కేజీల గంజాయిని తీసుకున్నాడు. తన క్యాబిన్‌లో పెడితే పోలీసులు తనిఖీ చేసే అవకాశం ఉండదని డ్రైవర్‌ భావించాడు. కాగా గంజాయి రవాణాపై మంగళగిరి పోలీసులకు సమాచారం అందింది. వారు ఎస్‌.కోట ఎస్‌ఈబీ, పోలీసులను అప్రమత్తం చేశారు. పై నుంచి వచ్చిన ఆదేశాలతో బుధవారం బొడ్డవర చెక్‌పోస్టు దాటిన తర్వాత లారీని ఆపారు. మొత్తం తనిఖీ చేయగా క్యాబిన్‌లో గంజాయి ప్యాకెట్‌లను గుర్తించారు. గంజాయి విలువ సుమారు.50లక్షలు ఉంటుందని అంచనా వేశారు. లారీ యాజమానిని కూడా గుర్తించామని, అతనిపైనా కేసు నమోదుచేశామని, త్వరలో అరెస్ట్‌చేస్తామని పోలీసులు తెలిపారు. జి.మాడుగులకు గంజాయి ఒడిశా రాష్ట్రం మాల్కాజ్‌గిరినుంచి వచ్చినట్లు గుర్తించామన్నారు. తనిఖీలో ఎస్‌ఈబీ సిబ్బందితో పాటు వీఆర్‌వోలు సోమరాజు, సముద్రం ఉన్నారు.

Updated Date - Mar 20 , 2024 | 11:52 PM