Share News

కిక్కు.. వారి ట్రిక్కు

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:21 AM

ఈసారి ఎన్నికల్లో రాజకీయ నాయకులు ముందుగానే ప్రలోభాలకు తెరతీశారు. మద్యాన్ని కీలక అస్త్రంగా వాడుకుంటున్నారు. ఎరగా వేసి కీలక వ్యక్తులను గుప్పిట్లో పెట్టుకుంటున్నారు.

కిక్కు.. వారి ట్రిక్కు
బొబ్బిలిలో ఈనెల 13న పట్టుబడిన మద్యం నిల్వలు(ఫైల్‌)

కిక్కు.. వారి ట్రిక్కు

ప్రలోభాల పర్వంలో రాజకీయ నాయకులు

రహస్య ప్రదేశాలకు మద్యం నిల్వలు

ప్రధాన కేంద్రాల నుంచే సరఫరా

షెడ్యూల్‌ వచ్చిన తరువాత 67 సారా కేసులు

1532 లీటర్ల మద్యం.. 170 లీటర్ల బీరు స్వాధీనం

61 వాహనాలు సీజ్‌

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

ఈసారి ఎన్నికల్లో రాజకీయ నాయకులు ముందుగానే ప్రలోభాలకు తెరతీశారు. మద్యాన్ని కీలక అస్త్రంగా వాడుకుంటున్నారు. ఎరగా వేసి కీలక వ్యక్తులను గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. రహస్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్టోర్‌లను మద్యంతో నింపేశారని సమాచారం. ఇదంతా చూస్తే ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, ప్రలోభాలకు దూరంగా జరగటం సాధ్యమా అన్న వాదన విన్పిస్తోంది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా మాఫియా రంగప్రవేశం చేసింది. అధికార పార్టీ నేతలకు నేరుగా ప్రధాన గోదాముల నుంచి నిల్వలు వెళ్తున్నాయి. ఈ అవకతవకల నేపథ్యంలోనే బేవరేజెస్‌ ఎండీని విధుల నుంచి తప్పించినట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు నాటుసారాను కూడా రాజకీయ నాయకులు అధికంగా అట్టి పెట్టుకుంటున్నారు. మత్తు పదార్థాలు సైతం రాజ్యమేలుతున్నాయి. కాగా షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి ఈ నెల 15 వరకు 67 నాటుసారా కేసులను నమోదు చేశారు. 1475 లీటర్ల సారా పట్టుకున్నారు. 16 మందిని అరెస్టు చేశారు. 34,400 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. 53 లిక్కర్‌ అక్రమ రవాణా కేసులు నమోదు చేశారు. 399 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1532 లీటర్ల మద్యం నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. 170 లీటర్ల బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 61 వాహనాలు, ఏడు సెల్‌ఫోన్లు, రూ.50వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 583 కిలోల గంజాయి నిల్వలను పట్టుకున్నారు. 15 మందిని అరెస్టు చేశారు. ఇలా ప్రలోభాలకు కాదేదీ అనర్హం అన్నట్లు మద్యాన్నే కీలకంగా ఉపయోగించుకుంటున్నారు.

- సారా కోసం ఏజెన్సీలోని కొందరు వ్యక్తులకు రాజకీయ నాయకుల నుంచి ఆర్డర్లు వెళ్లాయి. నల్లబెల్లం, నవ్వాసారం, యూరియా వంటి నిల్వలను పెద్ద ఎత్తున మైదాన ప్రాంతాల నుంచి ఏజెన్సీకి తరలించి అక్కడి నుంచి సారా తెప్పిస్తున్నారు. ఇదివరకు సారా గూనల్లో పులియబెట్టేవారు. ప్రస్తుతం ప్లాస్టిక్‌ డ్రమ్ములు వాడుతున్నారు. గత రెండు నెలల్లో చూస్తే పెద్ద ఎత్తున సారా ముడి సరుకులు ఏజెన్సీ వైపు వెళ్లాయి.

- మరో వైపు సామాజిక వర్గాల వారీగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు మతపరపైన ఓటు బ్యాంకుపైనా వైసీపీ నాయకులు దృష్టి పెట్టారు. ఆయా వర్గాల వారీతో సమావేశాలు నిర్వహించి వారికి బహుమతులు అందిస్తున్నారు. వలంటీర్లు, అంగన్వాడీలు, అశావర్కర్లు ఇలా చిరుద్యోగులను సైతం మభ్యపెట్టేందుకు అధికార వైసీపీ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు.

- విజయగనరం, ఎస్‌.కోట, బొబ్బిలి, చీపురుపల్లి తదితర నియోజవర్గాల్లో వైసీపీ నాయకులు వలంటీర్లకు దుస్తులు, నగదు పంపిణీ చేశారు. విజయనగరం ఎమ్మెల్యే షెడ్యూల్‌ విడుదలైన తరువాత కూడా ప్రైవేట్‌ కళాశాలల యాజుమాన్యాలు, పనిచేస్తున్న సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేసి తనకు సహకరించాలని కోరారు. కాగా వైసీపీలో కొనసాగుతూ పార్టీని చూడకండి తనను చూసి ఓటు వేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కోరిన సంగతి తెలిసిందే.

- నామినేషన్ల స్వీకరణ తరువాత ఎన్నికల ప్రచార పర్వం మరింత ఊపందుకోనుంది. అదే స్థాయిలో ప్రలోభాలు, మద్యం పంపకాలు, డబ్బు పంపిణీ, ఘర్షణలు, బెదిరింపులు ఎక్కువ కానున్నాయి. ఈ పరిస్థితిలో ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంది.

Updated Date - Apr 18 , 2024 | 12:21 AM