Share News

కల్యాణం.. కమనీయం

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:47 PM

రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో మంగళవారం రాత్రి సీతారాముల తిరుక్కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. రామతీర్థం దేవస్థానం పరిసరాలు రామనామ స్మరణతో మార్మోగాయి. భక్తులతో ఆవరణంతా కళకళలాడింది.

కల్యాణం.. కమనీయం

కల్యాణం.. కమనీయం

కన్నుల పండువగా సీతారాముల వివాహ వేడుక

రామనామస్మరణతో మార్మోగిన రామతీర్థం

ఉత్సాహంగా ఎదురు సన్నాహం

నెల్లిమర్ల, ఫిబ్రవరి 20: రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో మంగళవారం రాత్రి సీతారాముల తిరుక్కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. రామతీర్థం దేవస్థానం పరిసరాలు రామనామ స్మరణతో మార్మోగాయి. భక్తులతో ఆవరణంతా కళకళలాడింది. మామిడాకులు, పూలు, విద్యుత్‌ కాంతుల మధ్య అందంగా అలంకరించిన కల్యాణ వేదికపై సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఉంచి అర్చకులు సీతారాముల కల్యాణ ఘట్టాన్ని చేపట్టారు. విశ్వక్షేణ పూజతో శ్రీకారం చుట్టారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వందలాది మంది భక్తులు దేవస్థానానికి చేరుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి రెండున్నర గంటల వరకు కల్యాణం సాగింది. ఈ తంతుకు ముందు నవ వధూవరులను వేర్వేరుగా ఊరేగించే ఎదురు సన్నాహ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆనవాయితీగా సీతా రామలక్ష్మణులను అశ్వ, గరుడ, హంస వాహనాలపై రామతీర్థం ప్రధాన వీధుల్లో ఊరేగించారు. భక్తులు ఊరేగింపులో కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వివాహ ఘట్టం ఆరంభమైంది. స్థానాచార్యులు గొడవర్తి నరసింహాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు ఖండవిల్లి సాయి రామాచార్యులు, ఖండవిల్లి కిరణ్‌, పాణంగిపల్లి ప్రసాద్‌, సుదర్శనం పవన్‌కుమార్‌, రామ్‌గోపాల్‌ తదితరులు వివాహాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వై.శ్రీనివాసరావు పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. వరుడు శ్రీరామచంద్రుడి తరపున ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు పాల్గొనాల్సి ఉంది. ఆయన రాలేకపోవడంతో దేవస్థానం అధికారులు పాల్గొని శ్రీరామచంద్రునికి పట్టు వస్త్రాలను సమర్పించారు. వధువు సీతమ్మ తరపున అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం పూసపాటిరేగకు చెందిన ఏకుల రామారావు కుటుంబీకులు హాజరై వివాహ సామగ్రిని సమకూర్చారు. సీతమ్మకు బంగారు శతమానాలతో పాటు పండ్లు, పట్టు వస్త్రాలు, అరటి గెలు, కొబ్బరికాయలు సమకూర్చారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన సీతారాముల కల్యాణం జరిగింది. సీతమ్మ తలపై శ్రీరామ చంద్రుడు జీలకర్ర బెల్లం పెట్టిన సన్నివేశం, తలంబ్రాలు చల్లుకున్న సన్నివేశం చూసి భక్తులు పులకించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భోగాపురం సీఐ బి.వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో నెల్లిమర్ల ఎస్‌ఐ రామగణేష్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Feb 20 , 2024 | 11:48 PM