Share News

జై హనుమాన్‌

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:04 AM

హనుమజ్జయంతి జిల్లాలో వైభవంగా జరిగింది. రామాలయాలు, ఆంజనేయ స్వామి విగ్రహాల వద్ద పెద్దఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి ప్రీతిపాత్రమైన తమలపాకులు, వివిధ రకాల పండ్లను నైవేధ్యంగా సమర్పించారు. పూజల్లో పాల్గొన్న భక్తు లకు సింధూరం అందించారు.

జై హనుమాన్‌
విజయనగరం: ఊరేగింపులో హనుమాన్‌ విగ్రహం

జై హనుమాన్‌

ఘనంగా శోభాయాత్ర

కాషాయ వర్ణంగా మారిన విజయనగరం

విజయనగరం (ఆంధ్రజ్యోతి) జూన్‌ 1: హనుమజ్జయంతి జిల్లాలో వైభవంగా జరిగింది. రామాలయాలు, ఆంజనేయ స్వామి విగ్రహాల వద్ద పెద్దఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి ప్రీతిపాత్రమైన తమలపాకులు, వివిధ రకాల పండ్లను నైవేధ్యంగా సమర్పించారు. పూజల్లో పాల్గొన్న భక్తు లకు సింధూరం అందించారు. భక్తులు ఆంజనేయ స్వామి చిత్రంతో ఉన్న జెండాలను వాహనాలకు అమర్చుకుని జై..భజరంగ్‌ అంటూ నినాదాలు చేశారు. విజయనగరంలో హిందూ ధర్మ రక్షసమితి ఆధ్వర్యంలో హనుమాన్‌ శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. విగ్రహాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అలాగే విగ్రహాన్ని ఊరేగించే వాహనాన్ని విద్యుత్‌ దీపాలతో ముస్తాబు చేశారు. ర్యాలీలో యువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. వీరి ప్రదర్శనతో నగరం కాసాయరంగు పులుముకుంది. జై హనుమాన్‌, ఆంజనేయ, అంజినీపుత్ర, జై భజరంగ్‌ అంటూ నినాదాలు చేస్తూ శోభాయాత్ర కొనసాగించారు. ఉదయం కొత్తపేట కొత్తకోవెలలో హనుమాన్‌ విగ్రహాలకు హిందూధర్మ రక్షసమితి ప్రతినిధులు పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు కోట నుంచి ర్యాలీ చేపట్టారు. మూడులాంతర్లు, గంటస్తంభం, కన్యాకాపరమేశ్వరి ఆలయం, రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌, బాలాజీ జంక్షన్‌ మీదుగా తిరిగి కోట వరకు హనుమాన్‌ శోభాయాత్ర వైభవంగా సాగింది. స్కేటింగ్‌ విద్యార్థులు హనుమాన్‌ జెండాలు పట్టుకుని చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Updated Date - Jun 02 , 2024 | 12:04 AM