‘కోత’ల మాటలేనా?
ABN , Publish Date - Apr 10 , 2024 | 11:50 PM
రైతులను అన్ని విధాలా వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. రాయితీలను ఎత్తివేసిన ప్రభుత్వం ఇపుడు విద్యుత్ను కూడా సక్రమంగా అందివ్వడం లేదు. రైతుల వ్యవసాయ పంపు సెట్లకు నాణ్యమైన విద్యుత్ను 9గంటల పాటు అందిస్తామని జగన్ ప్రకటించారు.
‘కోత’ల మాటలేనా?
9గంటల నాణ్యమైన విద్యుత్ ఏదీ?
నిత్యం రెండు గంటల పాటు కట్
అనధికారికంగా మరిన్నిసార్లు నిలిపివేత
రబీలో రైతులకు ఇబ్బందులు
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
రైతులను అన్ని విధాలా వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. రాయితీలను ఎత్తివేసిన ప్రభుత్వం ఇపుడు విద్యుత్ను కూడా సక్రమంగా అందివ్వడం లేదు. రైతుల వ్యవసాయ పంపు సెట్లకు నాణ్యమైన విద్యుత్ను 9గంటల పాటు అందిస్తామని జగన్ ప్రకటించారు. అది కూడా పగటి పూట అందిస్తామని స్పష్టం చేశారు. ఈ మాట ఎంత కాలం నిలువలేదు. ప్రస్తుతం 9గంటలకు బదులు ఆరుగంటలకు కుదించారు. అంటే రెండు గంటల పాటు రైతులకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. దీంతో త్రీ ఫేజ్ విద్యుత్ లేక వ్యవసాయ పంపు సెట్లు పనిచేయక పంటలు ఎండిపోతున్నాయి. అరుతడి పంటల పరిస్థితి మరీదారుణం. ఆయిల్ పామ్ తోటలకు ప్రతి రోజు తడి అందించాలి. సక్రమంగా నీటి తడి అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏడు గంటలే త్రీఫేజ్ విద్యుత్ అందిస్తున్నారు. అది కూడా మధ్య మధ్యలో నిలిపివేస్తున్న కారణంగా తడి అందిన ప్రాంతమే మళ్లీ తడుస్తోంది. ఈ లోగా మళ్లీ సరఫరా నిలిపేయడంతో రైతులు అవస్థలు పడుతున్నారు.
నీరు అందించలేకున్నా..
ప్రభుత్వం ప్రకటించిన మాదిరిగా కాకుండా రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాలో కోత విధిస్తోంది. నేను రెండు ఎకరాలు ఆరుతడి పంటగా నవ్వులు వేశాను. కనీసం మూడు తడులు అందించాలి. కాని సరఫరా ఏడు గంటలే అందిస్తున్న కారణంగా పూర్తి ఆయకట్టుకు నీరు అందించలేకపోతున్నాను.
- బీవీ నాయుడు, రైతు, బొబ్బిలి
మొక్కజొన్న దిగుబడి తగ్గుతుందేమో
మూడు ఎకరాల్లో మొక్కజొన్నను రబీలో అరుతడి పంటగా వేశాను. విద్యుత్ పంపు సెట్టు ద్వారా నీటి తడులు అందిస్తున్నాను. 9గంటల విద్యుత్ సరఫరా ఉంటుంది కనుక ఇబ్బందిలేదని భావించాను. కాని రెండు గంటలు కోత వేసి ఏడు గంటలే అందిస్తున్నారు. అది కూడా సక్రమంగా రావటం లేదు దీంతో ఇబ్బందులు పడుతున్నా. దిగుబడి తగ్గుతుందేమోనని భయపడుతున్నాను.
. - ఆర్.సూరపునాయుడు, రైతు, డెంకాడ
------------------------------