‘ఉపాధి’లో అవకతవకలు
ABN , Publish Date - Aug 21 , 2024 | 11:55 PM
జియ్యమ్మవలస మండలంలోని ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మొఖాసా అల్లువాడ పంచాయతీ క్షేత్ర సహాయకునిపై వారు ఫిర్యాదు చేశారు.
జియ్యమ్మవలస, ఆగస్టు 21 : జియ్యమ్మవలస మండలంలోని ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మొఖాసా అల్లువాడ పంచాయతీ క్షేత్ర సహాయకునిపై వారు ఫిర్యాదు చేశారు. చనిపోయిన, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు, మంచంపై కదల్లేని స్థితిలో ఉన్న వారి పేర బిల్లులు మంజూరు చేసినట్లు చెబుతున్నారు. వాటిపై విచారణ చేపట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అక్రమంగా జమ
- గ్రామంలో ఈగల గంగ (జాబ్ కార్డు నెంబరు 20002) 2023 జూన్ 7న మరణించింది. ఆమె బ్యాంకు ఖాతాలో రూ. 7197.97 జమయ్యాయి.
- అదే గ్రామంలో మజ్జి పద్మావతి (జాబ్ కార్డు నెంబరు 10343), మండంగి నక్షత్రమ్మ (జాబ్ కార్డు నెంబరు 10004)లు ఇద్దరూ అంధులే. వారి అకౌంట్లలో రూ. 14,125.50, రూ.9336.97లు జమ అయ్యాయి.
- పడాల గణేష్బాబు (జాబ్ కార్డు నెంబరు 20126) విజయవాడలో చదువుతుండగా మరో 25 మంది గ్రామాల్లో లేనివారి ఖాతాల్లో డబ్బులు వేశారు.
- ఈ విధంగా వేతనాల్లో రూ. 2,47,120 వరకు అక్రమంగా జమ చేసినట్లు ఎంపీడీవో పి.శ్రీనివాసరావు ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో ఉంది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ పథకం సంచాలకులకు లిఖిత పూర్వకంగా నివేదిక అందజేశారు.