ధాన్యం కొనుగోలులో అవకతవకలు
ABN , Publish Date - Jan 09 , 2024 | 12:20 AM
రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మే క్రమంలో కొనుగోలుదారులు అవకతవకలకు పాల్పడుతున్నారని పలువురు సర్పంచ్లు ధ్వజమెత్తారు.
![ధాన్యం కొనుగోలులో అవకతవకలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బొండపల్లి: రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మే క్రమంలో కొనుగోలుదారులు అవకతవకలకు పాల్పడుతున్నారని పలువురు సర్పంచ్లు ధ్వజమెత్తారు. సోమవారం ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎంపీపీ చల్లా చలంనా యుడు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈసందర్భంగా వ్యవసాయ శాఖ కు సంబంధించి మరువాడ కొత్తవలస, బి.రాజేరు, కనిమెరక సర్పంచ్లు మాట్లాడు తూ పంటను మిల్లులకు పంపించేటపుడు రైతులు ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. తేమ శాతం అధికంగా ఉందనే పేరుతో సుమారు నాలుగు కేజీల ధాన్యాన్ని అదనంగా తీసుకుంటున్నారని సర్పంచులు ధ్వజమెత్తారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని స్పష్టం చేసినా.. కార్యరూపం దాల్చ డం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జలజీవన్ మిషన్కు సంబంధించి తాగు నీరు పూర్తి స్థాయిలో ఎప్పుడు సరఫరా చేస్తారని వేండ్రాం, మరువాడ కొత్తవలస, కిండాం అగ్రహారం సర్పంచ్లు కర్రోతు శ్రీనివాసరావు, బుంగ దేవుడులు ఆర్ డబ్ల్యూఎస్ జేఈని ప్రశ్నించారు. సీపీడబ్ల్యు స్కీం నిర్వహణ లోపంతో మరువాడ కొత్తవలసలో తాగునీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉందని సర్పంచ్ కర్రోతు శ్రీనివాసరావు సభ దృష్టికి తీసుకువచ్చారు. సంక్రాంతి పండగకు పూర్తి స్థాయిలో ప్రజలకు నీటిని అందిస్తామని ఆర్డబ్ల్యుఎస్ జేఈ సర్పంచ్లకు బదులిచ్చారు. గొట్లాంలో ఉన్న ఆయుర్వేదిక్ డిస్పెన్సరీని బొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించవద్దని పీఏసీఎస్ అధ్యక్షులు మహంతి రమణ కోరారు. ఈ విషయంలో ఎంపీపీ చలంనాయుడు జోక్యం చేసుకుంటూ సమస్యను ఎమ్మెల్యే అప్పలనరసయ్య దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ రాపాక సూర్య ప్రకాశరావు, ఎంపీడీవో వైవీ రాజేంద్రప్రసాద్, ఈవోపీఆర్డీ సుగుణాకరరావు, వైస్ సర్పంచ్ గొండేల ఈశ్వరరావు, సర్పంచ్లు నడుపూరు భాస్కరనాయుడు, కర్రి సత్యవ తి, లండ నారాయణమ్మ, శిరిపురపు పూర్ణిమ, ఎంపీటీసీలు తాళ్లపూడి అప్పలనా యుడు, బండారు బంగారం, బండారు శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.