కరెంట్ పోతే.. కారు చీకటి
ABN , Publish Date - May 12 , 2024 | 11:31 PM
సీతంపేట మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో కారు చీకటి నెలకొంది. చిన్నపాటి చార్జింగ్ లైట్ ఏర్పాటు చేసినప్పటికీ పోలింగ్ కేంద్ర పరిసరాలు చీకటి వాతావరణం ఏర్పడింది. అయితే పది నిమిషాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

సీతంపేట: సీతంపేట మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో కారు చీకటి నెలకొంది. చిన్నపాటి చార్జింగ్ లైట్ ఏర్పాటు చేసినప్పటికీ పోలింగ్ కేంద్ర పరిసరాలు చీకటి వాతావరణం ఏర్పడింది. అయితే పది నిమిషాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. సోమవారం జరిగే ఓటింగ్ కోసం ఆదివారం సాయంత్రమే మండలంలో కొన్ని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలివచ్చారు. అయితే ఈదురుగాలులకు ఒక్కసారిగా సీతంపేట పోలింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో సిబ్బందికి ఇబ్బందులు తప్పలేదు. వాస్తవానికి పోలింగ్ కేంద్రాలకు జనరేటర్ సౌకర్యం కల్పించాల్సి ఉంది. చిన్నపాటి చార్జింగ్ లైట్ సౌకర్యం కల్పించడంతో ఏ క్షణాన కరెంట్ పోతుందోనని పోలింగ్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. అసలే ఏజెన్సీ ప్రాంతం కాగా.. చిన్నపాటి వర్షానికి కూడా తరచూ కరెంట్ పోనుంది. దీంతో పలు పోలింగ్ కేంద్రాలు కారు చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.