మెగా డీఎస్పీ ఇవ్వకుంటే గద్దె దించేస్తాం
ABN , First Publish Date - 2024-02-06T00:15:15+05:30 IST
మెగా డీఎస్సీ ఇవ్వకుంటే ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధం.. హామీలు నమ్మి మోసపోయాం.. 23 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి... 117 జీవోను రద్దు చేయాలి.. ఉచిత పథకాలు వద్దు.. ఉద్యోగాలే ముద్దు అంటూ నిరుద్యోగులు ఉవ్వెత్తున నినదించారు.
మెగా డీఎస్పీ ఇవ్వకుంటే
గద్దె దించేస్తాం
కోట జంక్షన్లో నిరుద్యోగుల నిరసన
వేలాదిగా తరలివచ్చి బైఠాయింపు
విజయనగరం దాసన్నపేట, ఫిబ్రవరి 5: మెగా డీఎస్సీ ఇవ్వకుంటే ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధం.. హామీలు నమ్మి మోసపోయాం.. 23 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి... 117 జీవోను రద్దు చేయాలి.. ఉచిత పథకాలు వద్దు.. ఉద్యోగాలే ముద్దు అంటూ నిరుద్యోగులు ఉవ్వెత్తున నినదించారు. కోట జంక్షన్లో సోమవారం భారీ నిరసన దిగారు. వందలాదిగా తరలివచ్చిన నిరుద్యోగ యువతతో పాటు డీఎస్సీ అభ్యర్థులు తెలుగుయువత ఆధ్వర్యంలో ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. నాలుగేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వని ప్రభుత్వం ఎన్నికల ముందు మొక్కుబడిగా తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తామనడం సరికాదన్నారు. మినీ డీఎస్సీ వద్దు.. మెగా డీఎస్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరు జిల్లాల్లో ఎస్జీటీలు 0 చూపిస్తున్నారని, నాలుగు జిల్లాల్లో సింగిల్ డిజిట్ చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 44 ఏళ్ల వయసు పరిమితి ఇచ్చి 42 ఏళ్లకు సడలించడం దారుణమన్నారు. కాగా కోటకు ఎదురుగా ప్రధాన రోడ్డుపై ధర్నా చేయడంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. గుమ్చీ జంక్షన్ వైపు నుంచి వచ్చిన వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ధర్నా సాగింది. రాస్తారోకో నిర్వహించిన సందర్భంలో పోలీసులు కలుగజేసుకున్నారు. ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగించవద్దని కోరడంతో నిరుద్యోగులు ఓ పక్కకు జరిగారు. విజయనగరం డీఎస్పీ గోవిందరావు, ఐదుగురు సీఐలు, విజయనగరం వన్ టౌన్, టూ టౌన్ ఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది బందోబస్తుకు వచ్చారు.
- కోట జంక్షన్లో నిరుద్యోగులు సోమవారం చేపట్టిన నిరసనకు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి అదితి గజపతిరాజు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుద్యోగులను ఈ ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచిందన్నారు. తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ, జాబ్ క్యాలెండర్ అంటూ పాదయాత్ర సమయంలో ఊరువాడా హడావిడి చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే లేకుండా చేశారన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా నాయకులు వేమలి చైతన్యబాబు, జి.సురేంద్ర, గంటా రవి తదితరులు పాల్గొన్నారు.