మరచిపోయారు.. కా‘బట్టి’
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:41 AM
- రూపుమారని బట్టి కాలువ - మాట తప్పిన సీఎం జగన్ - ఏడాదైనా నెరవేరని హామీలు (భోగాపురం)
- రూపుమారని బట్టి కాలువ
- మాట తప్పిన సీఎం జగన్
- ఏడాదైనా నెరవేరని హామీలు
(భోగాపురం)
‘మాటిచ్చారంటే నిలబెట్టుకొనే నాయకు డు... మడమ తిప్పని ఒకే ఒక్కడు జగనన్న’ అని వైసీపీ నాయకులు పదే పదే చెబుతుంటారు. అలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బహిరంగ సభలో ఇచ్చిన హామీలను కనీసం అమలు చేయకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే.... 2023 మే నెల 3వ తేదీన జాతీయ రహదారి సమీపంలో విమానాశ్రయ శంకుస్థాపనకు సీఎం జగన్ వచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ హామీలన్నీ నెరవేర్చుతానంటూ సీఎం ప్రకటించారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఆ హామీల వైపు ఓ లుక్కేద్దామా?...
- భోగాపురం మండల కేంద్రంలోని బట్టికాలువ మరమ్మతులకు అదనంగా రూ.1.8 కోట్లు మంజూరు చేస్తామన్నారు.
- భోగాపురం, పూసపాటిరేగమండలాల్లోని 45 తీరప్రాంత గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే పథకాల ఏర్పాటుకు రూ.35 కోట్లు మంజూరు చేస్తామన్నారు.
- పూసపాటిరేగ మండలం కందివలస గెడ్డపై వంతెన నిర్మాణంతో పాటు చింతపల్లి, మెంటాడ గ్రామాల మధ్య రహదారి నిర్మాణానికి రూ.10 కోట్లు ఇస్తామన్నారు.
- డెంకాడ మండలం ద్వారపురెడ్డిపాలెం గ్రామ పరిధిలో చంపావతి నదిపై కాజ్ వే నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు.
- నెల్లిమర్ల మండలం తుమ్మలపేట- గరికిపేట గ్రామాల మధ్య బీటీ రోడ్డు నిర్మాణానికి రూ2.కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఏడాది గడుస్తున్నా... నెరవేరలేదు. ఈ హామీల తీరు చూసి... జగనన్న మాట నిలబెట్టుకోవడమంటే ఇదేనేమో అంటూ ఈ ప్రాంతీయులు ముక్కున వేలేసుకుంటున్నారు.