ఈసీఐ అనుమతిపత్రం తప్పనిసరి
ABN , Publish Date - Jun 03 , 2024 | 12:14 AM
జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు చెందిన ప్రధాన పార్టీ అభ్యర్థులు ఓట్లు లెక్కింపునకు ఏజెంట్లను ఎంపిక చేశారు.
![ఈసీఐ అనుమతిపత్రం తప్పనిసరి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సాలూరు రూరల్: జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు చెందిన ప్రధాన పార్టీ అభ్యర్థులు ఓట్లు లెక్కింపునకు ఏజెంట్లను ఎంపిక చేశారు. వారిని కౌంటింగ్ ఏజెంట్లగా నియమించాలని ఆర్వోలకు దరఖాస్తు సైతం అందించారు. ఒక్కో నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థి 14 మంది ఏజెంట్లను పంపించుకోవచ్చు. టేబుళ్ల వద్ద కాకుండా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వద్ద మరొక ఏజెంట్ ఉండే అవకాశముంది. లెక్కింపు కేంద్రంలోకి లెక్కింపు సిబ్బందితో సహా పార్టీల పక్షాన వచ్చే కౌంటింగ్ ఏజెంట్లకు గుర్తింపు కార్డుతో పాటు ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన అనుమతి పత్రం తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. లెక్కింపు కేంద్రంలో టేబుళ్ల వారీగా విధులు నిర్వర్తించే సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్వు ఉంటారు. పార్టీ అభ్యర్థుల తరపున లెక్కింపు ఏజెంట్లుగా వచ్చే వారు తమ ఏజెంట్ నియమాక పత్రం, గుర్తింపు కార్డును చూపించి ఆర్వో ఎదుట డిక్లరేషన్పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఆర్వో అనుమతి అనంతరం లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒక టేబుల్కు ఒకరినే అభ్యర్థి తరపున ఏజెంటుగా అనుమతిస్తారు. ఏజెంట్లు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఓట్ల లెక్కింపు కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవరిస్తే చర్యలు తీసుకునే అవకాశముంది.