ఎన్నికల ఏర్పాట్లపై అలసత్వం వద్దు
ABN , Publish Date - Feb 20 , 2024 | 11:39 PM
సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో అలసత్వం వహించరాదని పార్వతీపురం, పాలకొండ ఆర్డీవోలు కె.హేమలత, రమణ సూచించారు. మంగళవారం ఉల్లిభద్రలో వైఎస్ఆర్ ఉద్యాన కళాశాలను పరిశీలించారు.
![ఎన్నికల ఏర్పాట్లపై అలసత్వం వద్దు](https://media.andhrajyothy.com/media/2024/20240215/20ppmp4_bc828b4064.gif)
గరుగుబిల్లి, ఫిబ్రవరి 20 : సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో అలసత్వం వహించరాదని పార్వతీపురం, పాలకొండ ఆర్డీవోలు కె.హేమలత, రమణ సూచించారు. మంగళవారం ఉల్లిభద్రలో వైఎస్ఆర్ ఉద్యాన కళాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాకు సంబంధించి నాలుగు నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపుతో పాటు తదితర కార్యక్రమాలు ఈ ప్రాంతంలో నిర్వహించేందుకు అనుమతులు మంజూరు చేశారన్నారు. ఈ మేరకు ముందస్తుగా స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ నిర్వహణ, వాహనాల పార్కింగ్కు కేటాయించిన స్థలం, పలు గదులను తనఖీ చేశామని తెలిపారు. ఈ ప్రాంతం అన్నింటికీ అనుకూలంగా ఉండటంతో రూట్ మ్యాప్లు, భవన సముదాయాలు సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు వారు వివరించారు. నాలుగు నియోజకవర్గాల్లోని అధికారులు ఎన్నికల నిర్వహణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించరాదని తెలిపారు. ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో సమాచారం అందించడంతో పాటు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ పరిశీలనలో డివిజన్ సర్వే అధికారి కె.సూర్యారావు, గరుగుబిల్లి, పార్వతీపురం ఇన్చార్జి తహసీల్దార్లు పి.సత్యలక్ష్మికుమార్, టీవీ రమణ, సర్వేయర్లు బి.శ్రీనివాసరావు, సన్యాసినాయుడు, ఆర్అండ్బీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.