పోటాపోటీగా..
ABN , Publish Date - Jan 29 , 2024 | 12:29 AM
సంగిడీ రాళ్ల పోటీలు.. టైర్ బండ్ల పరుగు పోటీలు వేపాడ వాసులను అలరించాయి. రోజంతా యువతను ఉర్రూతలూగించాయి. ఆదివారం గ్రామ దేవతలు ముత్యాలమ్మ, పరదేశమ్మ అమ్మవార్ల తీర్థం పురస్కరించుకొని ఈ పోటీలు నిర్వహించారు.
పోటాపోటీగా..
అలరించిన సంగిడీ రాళ్ల పోటీలు
ఉల్లాసంగా సాగిన టైర్ బండ్ల పరుగు పోటీలు
వేపాడ, జనవరి 28: సంగిడీ రాళ్ల పోటీలు.. టైర్ బండ్ల పరుగు పోటీలు వేపాడ వాసులను అలరించాయి. రోజంతా యువతను ఉర్రూతలూగించాయి. ఆదివారం గ్రామ దేవతలు ముత్యాలమ్మ, పరదేశమ్మ అమ్మవార్ల తీర్థం పురస్కరించుకొని ఈ పోటీలు నిర్వహించారు. వేపాడతో పాటు వల్లంపూడి, బక్కునాయుడుపేట, రాయుడుపేట, దబ్బిరాజుపేట, ఆతవ, ఆకులసీతంపేట, చామలాపల్లి తదితర గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. టైర్ బండ్ల పరుగు పోటీలు ఉల్లాసంగా సాగాయి. కబడ్డీ పోటీల్లో క్రీడాకారులు హోరా హోరీగా తలపడ్డారు. సుమారు 30 జట్లు పాల్గొనగా నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు. సంగిడీ రాళ్ల పోటీల్లో విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు చెందిన ప్రాంతాల నుంచి సుమారు 15 మంది వస్తాదులు హాజరు కాగా 20 కేజీల నుండి 160 కేజీల రాళ్లను ఏర్పాటు చేశారు. వస్తాదులు తీత, పోటు, ఇసురు విభాగాల్లో తమ సత్తామేరకు రాళ్లను ఎత్తి నైపుణ్యం చాటారు.