బై..పాస్ రోడ్డు!
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:45 AM
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని బోడికొండను ఆనుకొని నిర్మిస్తామని చెప్పిన బైపాస్ రోడ్డుకు బైబై చెప్పేసినట్టేనా? దీని నిర్మాణంపై ఎంఎల్ఎ బడ్డుకొండ అప్పలనాయుడు ఇచ్చిన హామీ ఐదేళ్లుగా అలాగే ఉండిపోయింది.
- ఎమ్మెల్యే బడ్డుకొండ హామీ నెరవేరని వైనం
నెల్లిమర్ల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని బోడికొండను ఆనుకొని నిర్మిస్తామని చెప్పిన బైపాస్ రోడ్డుకు బైబై చెప్పేసినట్టేనా? దీని నిర్మాణంపై ఎంఎల్ఎ బడ్డుకొండ అప్పలనాయుడు ఇచ్చిన హామీ ఐదేళ్లుగా అలాగే ఉండిపోయింది. నెల్లిమర్ల నుంచి రణస్థలానికి చేరుకోవడానికి ఆర్ అండ్ బీ రోడ్డు రామతీర్థం గ్రామం మఽద్య నుంచి వెళుతుంది. దీని వల్ల వాహనాల రాకపోకలకు.. స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో జరిగే ఉత్సవాల సమయంలో ఈ రోడ్డు భక్తులతో నిండిపోతుంది. ఆ సమయంలో వాహనాల రాకపోకలను తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఏటా శివరాత్రి, ఆ మరుసటి రోజున లక్షలాది మందితో జరిగే పెద్ద జాతర సమయంలో రామతీర్థం ఆవలి గ్రామాల ప్రజలు, ప్రయాణికులు ఈ రోడ్డు దాటడం కత్తి మీదసామే. ఈ ఉత్సవాల సమయంలో కష్టాలను పరిగణనలోకి తీసుకుని బైపాస్ రోడ్డు నిర్మిస్తామని గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే బడ్డుకొండ హమీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. ప్రజల కష్టాలు అలాగే ఉన్నాయి. ఉత్సవ సమయంలో సమీపంలోని సీతారామునిపేట- దన్నానపేట రోడ్డే దిక్కవుతోంది. బడ్డుకొండ హామీ నెరవేరకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.