Share News

మండిన మన్యం

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:34 PM

పార్వతీపురం మన్యం జిల్లా ఎండలతో మండుతోంది. సూర్య ప్రతాపానికి విలవిల్లాడిపోతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిగా మారింది. అధిక వేడి, ఉక్కపోత, వడగాల్పులకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

మండిన మన్యం
నిర్మానుష్యంగా పాలకొండ రహదారి

సీతంపేటలో అత్యధికంగా 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదు

జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి..

పాలకొండ/సీతంపేట/గుమ్మలక్ష్మీపురం : పార్వతీపురం మన్యం జిల్లా ఎండలతో మండుతోంది. సూర్య ప్రతాపానికి విలవిల్లాడిపోతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిగా మారింది. అధిక వేడి, ఉక్కపోత, వడగాల్పులకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి సాహసించడం లేదు. దీంతో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రధాన రహదారులు, కూడళ్లు, మార్కెట్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇదిలా ఉండగా జిల్లాలో శుక్రవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా పాలకొండలో 43, సాలూరు, గుమ్మలక్ష్మీపురంలో 45, సీతంపేటలో 46 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వృద్ధులు, చిన్నారులతో పాటు అన్ని వయస్కుల వారు ఇళ్లలో ఉండలేక.. బయటకు రాలేక నానా యాతన పడ్డారు. కొన్నిచోట్ల విద్యుత్‌ కోతలు ఉండగా, రాత్రివేళల్లో కూడా వేడి తగ్గకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడి నుంచి కాస్త ఉపశమనం కోసం కొందరు చెట్ల నీడను ఆశ్రయించగా, మరికొందరు శీతలపానియాలు తాగారు. పలుచోట్ల యువత నదులు, చెరువులు, కోనేరుల్లో స్నానాలు చేసి సేదతీరారు. ఏదేమైనా మరికొద్దిరోజుల పాటు గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో జిల్లావాసులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక మే నెలలో పరిస్థితేమిటోనని టెన్షన్‌ పడుతున్నారు. ఏదేమైనా ఎండల నేపథ్యంలో జిల్లావాసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:34 PM