వ్యక్తిపై కత్తితో దాడి.. కేసు నమోదు
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:14 AM
వ్యక్తిపై కత్తితో దాడి చేసి పీక కోసిన ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది.
వేపాడ: వ్యక్తిపై కత్తితో దాడి చేసి పీక కోసిన ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వల్లంపూడి ఎస్ఐ రాజేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వావిలపాడు గ్రామంలో కొచ్చెర్ల సన్యాసిరావు, ఆరిపాక సంతోష్ ఇరుగుపొరుగు ఇళ్లలోనే నివసిస్తున్నారు. ఇద్దరూ సరదాగా, సన్నిహితంగా ఉండేవారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే గురువారం ఉదయం సన్యాసి రావు ఇంట్లోకి సంతోష్ వెళ్లి.. మాట్లాడుతూ ఉన్నట్టుండి సన్యాసిరావు పీకపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో సన్యాసిరావు ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని తక్షణమే కే.కోటపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించగా ఆస్పత్రిలోనే ఉన్నాడు. దాడికి పాల్పడిన ఆరిపాక సంతోష్ వల్లంపూడి పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. పోలీసులు సంతోష్ను అదుపులోకి తీసుకోవడంతో పాటు కేసు నమోదు చేశారు.