‘పల్లె పండగ’ పనులన్నీ ప్రారంభించాల్సిందే..
ABN , Publish Date - Nov 13 , 2024 | 11:33 PM
: పల్లె పండగ కార్యక్రమం కింద జిల్లాలో గుర్తించిన పనులన్నీ ప్రారంభించాల్సిందేనని కలెక్టర్ శ్యామ్ప్రసాద్ ఆదేశించారు. డిసెంబరు నెలాఖరుకు అన్ని పూర్తి కావాలన్నారు. పంచాయతీరాజ్శాఖ ద్వారా చేపట్టిన 521 పనుల్లో 386 పనులు ఇంతవరకు ప్రారంభం కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

పార్వతీపురం, నవంబరు13 (ఆంధ్రజ్యోతి): పల్లె పండగ కార్యక్రమం కింద జిల్లాలో గుర్తించిన పనులన్నీ ప్రారంభించాల్సిందేనని కలెక్టర్ శ్యామ్ప్రసాద్ ఆదేశించారు. డిసెంబరు నెలాఖరుకు అన్ని పూర్తి కావాలన్నారు. పంచాయతీరాజ్శాఖ ద్వారా చేపట్టిన 521 పనుల్లో 386 పనులు ఇంతవరకు ప్రారంభం కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన కురుపాం, జియ్యమ్మవలస, పాచిపెంట, సాలూరు ఏఈఈలకు చార్జి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. రహదారులు, వంతెనలు, కల్వర్టులపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. రోడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించడంపై మండిపడ్డారు. కాంట్రాక్టర్లతో వర్క్లు చేయించాల్సిన బాధ్యత సంబంధిత ఇంజనీరింగ్ అధికారులదేనన్నారు. 19 గిరిజన గ్రామాల్లో తక్షణమే రహదారి నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, ఐటీడీఏల పరిధిలోని ఈఈలు, డీఈలు, ఏఈఈలు తదితరులు పాల్గొన్నారు.
- బెలగాం, నవంబరు13 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ సుందర పార్వతీపురం కల సాకారం అవ్వాలంటే పట్టణంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పారిశుధ్యం మెరుగు పరిస్తే స్వచ్ఛ సుందర పార్వతీపురం సాధ్యమన్నారు. దోమల నివారణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మరుగుదొడ్ల వినియోగం పెరగాలని సూచించారు. వ్యక్తిగత పరి శుభ్రతతో వ్యాధులను నిర్మూలించొచ్చని తెలిపారు. వ్యర్థ పదార్థాలతో సంపద సృష్టించొచ్చన్నారు.