ఆగి ఉన్న కారును ఢీకొన్న లారీ
ABN , Publish Date - Mar 12 , 2024 | 12:12 AM
మండల కేంద్రమైన కొత్తవలసలో విజయ నగరం- కొత్తవలస రోడ్డు మార్గంలో పీఎంఎల్ కాంప్లెక్స్ వద్ద ఆగి ఉన్న కారును లారీ ఢీకొన్న సంఘటనలో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
లక్కవరపుకోట(కొత్తవలస): మండల కేంద్రమైన కొత్తవలసలో విజయ నగరం- కొత్తవలస రోడ్డు మార్గంలో పీఎంఎల్ కాంప్లెక్స్ వద్ద ఆగి ఉన్న కారును లారీ ఢీకొన్న సంఘటనలో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ స్థానిక పోలీసు స్టేషన్లో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు లు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని సీతంపేటకు చెందిన ఇద్దరు, కాంప్లెక్స్ వద్ద ఒకరు, దేశపాత్రునిపాలెంకు చెందిన మరొకరు అనారోగ్య రీత్యా ఆసుపత్రికి వెళ్లేందుకు కారులో సిద్ధమయ్యారు. వీరంతా కారులో పీఎంఎల్ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. ఇంతలో విజయనగరం వైపు నుంచి వస్తున్న లారీ ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయిదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో మోపాడ లక్ష్మి పరిస్థితి విషమంగా ఉందని వైద్యు లు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.