24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
ABN , Publish Date - May 20 , 2024 | 11:26 PM
జిల్లాలో ఈ నెల 24 నుంచి జూన్ 7వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని ఇన్చార్జి డీఆర్వో జి.కేశవనాయుడు తెలిపారు.
![24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ](https://media.andhrajyothy.com/media/2024/20240511/Whats_App_Image_2024_05_20_a_035a9563a6.gif)
పార్వతీపురం, మే20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 24 నుంచి జూన్ 7వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని ఇన్చార్జి డీఆర్వో జి.కేశవనాయుడు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. వర్షాలు పడే అవకాశం ఉన్నందున పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో 17 సెంటర్లలో తాగునీరు, వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా బస్సులు నడపాలని సూచించారు. ఇంటర్ మొదటి సంవత్సరం వారికి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సంవత్సరం వారికి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఆ సమయాల్లో విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని ఆ శాఖాధికారులను ఆదేశించారు. పరీక్ష పేపర్లను నిర్దేశిత కేంద్రాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని పోస్టల్ శాఖను కోరారు. బందోబస్తు పక్కాగా ఉండాలని పోలీసులకు సూచించారు. పరీక్షల సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ జిల్లా అధికారి డి.మంజులవీణ, తదితరులు పాల్గొన్నారు.