పేదోడి పొట్టకొట్టిన వైసీపీ
ABN , Publish Date - Apr 26 , 2024 | 12:59 AM
నిరుపేదల కడుపు నింపేందుకు టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్ష గట్టింది.
తెలుగుదేశం హయాంలో పట్టణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభం
జీవీఎంసీ పరిధిలో 25చోట్ల ఏర్పాటు
రూ.5కే అల్పాహారం
మధ్యాహ్నం/రాత్రి భోజనం రూ.5కే నాణ్యమైన ఆహారం అందించడంతో క్యాంటీన్లకు విశేష ఆదరణ
వైసీపీ అధికారంలోకి రాగానే క్యాంటీన్ల మూసివేత
పేదలు, కూలీల్లో ఆగ్రహం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నిరుపేదల కడుపు నింపేందుకు టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్ష గట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని మూసివేయించింది. రూ.5కు అన్నం పెట్టిన క్యాంటీన్లను నిర్దాక్షిణ్యంగా మూసివేయించడం దారుణమంటూ వైసీపీ ప్రభుత్వంపై పేదలు, కూలీలు ఆగ్రహంతో ఉన్నారు.
పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలు, భవన నిర్మాణ కూలీలు, తదితరులకు కేవలం రూ.5కు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 2018 జూన్ 11న రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. అన్న క్యాంటీన్లకు ఆహారాన్ని సరఫరా చేసే బాధ్యతను అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థకు అప్పగించింది. అన్న క్యాంటీన్లో ప్రతిరోజూ ఉదయం ఏదో ఒక అల్పాహారాన్ని రూ.ఐదుకే అందజేసేవారు. అలాగే మధ్యాహ్నం, రాత్రి పూట కూడా నాణ్యమైన భోజనాన్ని రూ.5కే పెట్టేవారు. అనతికాలంలోనే అన్న క్యాంటీన్లకు విశేషమైన ఆదరణ రావడంతో దశల వారీగా జీవీఎంసీ పరిధిలో విమ్స్ ఎదురుగా, ఎంవీపీ రైతుబజార్, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ టీబీ ఆస్పత్రి, టర్నర్ చౌలీ్ట్ర, హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్, మర్రిపాలెం, శ్రీహరిపురం, ములగాడ పంప్హౌస్, చినగంట్యాడ, చిట్టివలస, రైల్వేస్టేషన్, బాజీ జంక్షన్, పెందుర్తి, వేపగుంట, గోపాలపట్నం రైతుబజార్, కేజీహెచ్ ఓపీ గేట్, ఆరిలోవ, మారికవలస, వాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి, తదితర 25 చోట్ల అన్న క్యాంటీన్లను ఏర్పాటుచేశారు. వీటన్నింటికీ పక్కా భవనాలు కట్టించి భోజనం చేసేవారికి సౌకర్యంగా ఉండేందుకు కుర్చీలు, టేబుళ్లు వంటి సదుపాయాలు కల్పించారు. భవన నిర్మాణ కూలీలు, రిక్షావాలాలు, ఆటోడ్రైవర్లు, నిరుపేదలు, ఉద్యోగ శిక్షణ కోసం నగరంలో ఉండే పేద విద్యార్థులు క్యాంటీన్లలో ఆకలి తీర్చుకునేవారు. నగర పరిధిలో ప్రతిరోజూ సగటున పది వేల మంది అల్పాహారం, 15 వేల మంది మధ్యాహ్నం భోజనం, పది వేల మంది రాత్రి భోజనం చేసేవారు. కూలీలు, చిరుద్యోగులు, అల్పాదాయ వర్గాలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం సమకూరడంతో ఖర్చులు తగ్గి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగేది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్లను మూసివేయించింది. అన్నక్యాంటీన్ల పేరు మార్చాలని మొదట్లో వైసీపీ నేతలు భావించినా, వాటిపై టీడీపీ ముద్ర తొలగిపోదనే ఉద్దేశంతో శాశ్వతంగా మూసివేయించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అన్న క్యాంటీన్లకు ప్రత్యామ్నాయంగా అంతకంటే మెరుగ్గా ఉండేలా ‘ఆహా క్యాంటీన్ల’ను ఏర్పాటుచేస్తామని వైసీపీ నేతలు ప్రకటించినా, ఐదేళ్లయినా కార్యరూపం దాల్చలేదు. అయితే తమకు నామమాత్రపు ధరకు నాణ్యమైన ఆహారాన్ని అందించిన అన్న క్యాంటీన్లను రద్దు చేసి తమ కడుపు కొట్టారంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిరుపేదలు ఇప్పటికీ తూర్పారబడుతుంటారు.
సమయానికి నాణ్యమైన ఆహారం తినేవాళ్లం
కందివలస కృష్ణ, అక్కయ్యపాలెం
అన్న క్యాంటీన్ మా ఇంటికి దగ్గర్లోనే సోనియానగర్ వద్ద ఉండేది. మూడు పూటలా నాణ్యమైన ఆహారాన్ని అందుబాటులో ఉంచేవారు. రూ.ఐదుకే అల్పాహారం తిని పనికి వెళ్లిపోతే, రాత్రికి రూ.5కే మళ్లీ అక్కడే భోజనం తిని ఇంటికి వెళ్లిపోయేవాడిని. మా ఇంట్లో ఉన్నవారు కూడా అన్న క్యాంటీన్లోనే భోజనం చేసేవారు. ఆరోగ్యం కూడా బాగుండేది. అన్న క్యాంటీన్లను మూసివేయడంతో అర్ధాకలితో జీవనంసాగిస్తున్నాం. ఉదయం టిఫిన్ చేయాలంటేనే రూ.50 వెచ్చించాల్సివస్తోంది. మళ్లీ అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తేవాలి.
రాజకీయాల కోసం పేదల కడుపు కొట్టారు
వై.చిట్టిబాబు, రామకృష్ణానగర్
రాజకీయాల కోసం అన్న క్యాంటీన్లను మూసి వేయించి మాలాంటి పేదల కడుపు కొట్టారు. టీడీపీ హయాంలో ఏర్పాటుచేశారనే అక్కసుతోనే వైసీపీ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను మూసివేయించేశారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేసిన తర్వాత నామమాత్రపు ధరతో మూడు పూటలా నాణ్యమైన ఆహారం తినగలిగాం. దీనివల్ల ఆర్థికంగా కూడా మాకు భారం తగ్గింది. అన్న క్యాంటీన్లు రద్దు చేయడంతో వచ్చిన కూలీ డబ్బుల్లో సగం డబ్బుని ఆహారానికే ఖర్చు చేయాల్సిన పరిస్థితి దాపురించింది.
జీవీఎంసీ పరిధిలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లు 25
ఉదయం టిఫిన్ రూ.5
మధ్యాహ్నం భోజనం రూ.5
మధ్యాహ్నం భోజనం రూ.5
ప్రతీరోజూ అల్పాహారం చేసినవారి సంఖ్య 10 వేలు
ప్రతీరోజూ మధ్యాహ్నం భోజనం చేసినవారి సంఖ్య 15వేల మంది
ప్రతీరోజూ రాత్రి భోజనం చేసేవారి సంఖ్య 10వేలు