Share News

కోడ్‌ కూసి నెల.. రంగులు మారకుంటే ఎలా..?

ABN , Publish Date - Apr 17 , 2024 | 11:45 PM

ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలను తూ.చ. తప్పక పాటించడం ఆయా శాఖల విధి. అందుకే పంచాయతీ అధికారి నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు ఎన్నికల సమయాల్లో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ.. సదరు నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంటారు. కానీ మాడుగుల మండలంలో పలుచోట్ల భిన్నంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

కోడ్‌ కూసి నెల.. రంగులు మారకుంటే ఎలా..?
లోవ గవరవరంలో వైసీపీ జెండా రంగులు మారని వాటర్‌ ట్యాంకు

మాడుగుల మండలంలో పలుచోట్ల ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన!

ఇప్పటికీ వాటర్‌ ట్యాంకులు, శిలాఫలకంపై కనిపిస్తున్న వైసీపీ జెండా రంగులు

పట్టించుకోని అధికారులు

విస్తుపోతున్న ప్రజలు

మాడుగుల/ మాడుగుల రూరల్‌, ఏప్రిల్‌ 17 : ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలను తూ.చ. తప్పక పాటించడం ఆయా శాఖల విధి. అందుకే పంచాయతీ అధికారి నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు ఎన్నికల సమయాల్లో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ.. సదరు నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంటారు. కానీ మాడుగుల మండలంలో పలుచోట్ల భిన్నంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో ఇప్పటికీ వాటర్‌ ట్యాంకులపై వైసీపీ జెండా రంగులు కనిస్తుండడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు.

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు మే 13న జరగనున్న నేపథ్యంలో దాదాపు నెల రోజుల క్రితం ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు రాజకీయ నాయకుల విగ్రహాల ముఖాలకు ముసుగులు ధరించాలి. పార్టీల జెండాలు ఎక్కడా అనుమతి లేకుండా ఏర్పాటు చేయరాదు. అలాగే, అధికారంలో ఉండే పార్టీల జెండా రంగులు ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన వాటిపై ఉండరాదు అన్నది నిబంధన. కానీ మండలంలోని పలుచోట్ల ఇప్పటికీ అధికార పార్టీ వైసీపీ జెండాకు చెందిన రంగులు దర్శనమిస్తుండడాన్ని చూసి పలువురు నివ్వెరపోతున్నారు. ఎల్‌.పొన్నవోలు పంచాయతీ లోవ గవరవరం, గదబవీధి గ్రామల్లో గల రక్షిత మంచినీటి పథకాల ట్యాంకులకు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వేసిన ఆ పార్టీ జెండా రంగులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఈ రంగులను తొలగించాల్సి ఉన్నా పట్టించుకునేవారు కరువయ్యారు. అదే విధంగా మాడుగులలో వెలుగు క్రాంతి పథం ఆధ్వర్యంలో ఏర్పాటైన మహిళా మార్టును స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కన ఏర్పాటు చేశారు. ఈ మార్ట్‌లోకి వెళ్లేందుకు ఎంట్రన్స్‌లో ఇనుప గేట్లు ఉన్నాయి. వాటికి సైతం వైసీపీ జెండా రంగులు వేసేశారు. అలాగే ఘాట్‌రోడ్డు జంక్షన్‌ నుంచి కింతలి వెళ్లేందుకు కొత్తగా తారురోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ శిలాఫలకంపై ఉన్న పేర్లు కనిపించకుండా కాగితాలు అంటించినప్పటికీ, శిలాఫలకానికి వేసిన వైసీపీ జెండా రంగులు మాత్రం తొలగించలేదు. వీటిని చూసినవారు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Apr 17 , 2024 | 11:45 PM