ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తాం
ABN , Publish Date - Jun 12 , 2024 | 01:14 AM
విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
![ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తాం](https://media.andhrajyothy.com/media/2024/20240604/babu_9c1d8ed397.jpg)
పార్టీకి అండగా నిలిచిన నగరం రుణం తీర్చుకుంటాం
టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
విశాఖపట్నం, జూన్ 11 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కూటమి (తెలుగుదేశం, జనసేన, బీజేపీ) తరపున ఎన్నికైన శాసనసభ్యులతో మంగళవారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ పట్టం కడుతూనే ఉన్నారని, వారి రుణం తీర్చుకుంటామన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రం అంతటా వైసీపీ అభ్యర్థులు గెలిస్తే...విశాఖ ప్రజలు నగరంలోని నాలుగు స్థానాల్లో టీడీపీ నాయకులను గెలిపించారన్నారు. తాజాగా జరిగిన ఎన్నికలను చూసుకుంటే..రాష్ట్రంలో ఎక్కడా రానంత మెజారిటీ విశాఖ జిల్లాలో పోటీ చేసిన కూటమి నాయకులకు వచ్చిందన్నారు. ఒక్కొక్కరికి 70 వేలు, 80 వేలు, 90 వేలు మెజారిటీలు వచ్చాయన్నారు. ఇంత అభిమానం చూపిస్తున్న విశాఖ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.