ప్రజలతో మమేకం
ABN , Publish Date - Feb 28 , 2024 | 11:14 PM
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి బుధవారం ఉదయం మండలంలోని మాదల పంచాయతీ ముసిరిగుడ గ్రామంలో పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన పార్టీ కార్యకర్త సొనాయి బసు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.
![ప్రజలతో మమేకం](https://media.andhrajyothy.com/media/2024/20240227/28_ark_bhuv_1_494b51f540.jpg)
ముసిరిగుడ గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటన
మృతుని కుటుంబానికి పరామర్శ
పార్టీ అండగా ఉంటుందని ఓదార్పు
గ్రామంలోని మహిళలకు ఆత్మీయ పలకరింపు
అరకులోయ, ఫిబ్రవరి 28: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి బుధవారం ఉదయం మండలంలోని మాదల పంచాయతీ ముసిరిగుడ గ్రామంలో పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన పార్టీ కార్యకర్త సొనాయి బసు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. బసు చిత్రపటం వద్ద నివాళులర్పించి, అతని భార్య కాసులమ్మను ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తనను చూసేందుకు వచ్చిన గ్రామంలోని మహిళలను ఆప్యాయంగా పలకరించారు. చిన్నారులకు చాక్లెట్లు పంచిపెట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు.
ప్రకృతి అందాలకు ఫిదా
అరకులోయ నుంచి ముసిరిగుడ వెళ్లే లోతేరు రహదారిలో ప్రకృతి అందాలను చూసి ఆమె పరవశించిపోయారు. ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న అరకు గోల్డ్ కాఫీ పాయింట్ వద్ద ఆగి అరకు కాఫీ రుచి చూశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏజెన్సీలో రూ.5.30 కోట్లతో పెద్ద ఎత్తున కాఫీ తోటలు వేయించి గిరిజన రైతులను ప్రోత్సహించారని భువనేశ్వరికి అరకు అసెంబ్లీ అభ్యర్థి దొన్నుదొర వివరించారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ హయాంలో పర్యాటకంగా కనీస అభివృద్ధి జరగలేదని, అరకును పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.