ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నాం
ABN , Publish Date - Apr 19 , 2024 | 01:51 AM
బొగ్గు సమస్య నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ముందుకు వెళుతున్నట్టు ఉక్కు యాజమాన్యం గురువారం ఒక ప్రకటనలో తెలియజేసింది.
స్టీల్ ప్లాంటుకు నిరంతరాయంగా ముడి పదార్థాలు సరఫరా అయ్యేలా ప్రణాళిక
సీఎండీ అతుల్భట్
ఉక్కుటౌన్షిప్, ఏప్రిల్ 18:
బొగ్గు సమస్య నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ముందుకు వెళుతున్నట్టు ఉక్కు యాజమాన్యం గురువారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్లాంటు ప్రస్తుతం సురక్షిత నిర్వహణలో ఉన్నట్టు పేర్కొంది. అదానీ గంగవరం పోర్టులో కార్మికులు చేస్తున్న సమ్మె వల్ల ఉత్పత్తికి అడ్డంకులు ఎదురవుతున్నట్టు వెల్లడించింది. అయితే వాటిని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. జిల్లా యంత్రాంగం సహకారంతో గంగవరం పోర్టులో ఉన్న కోకింగ్ కోల్ను విశాఖ పోర్టుకు తరలించేందుకు చర్యలు చేపట్టినట్టు యాజమాన్యం పేర్కొంది. ప్లాంటుకు ముడి పదార్థాల నిరంతర సరఫరా కోసం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్టు స్టీల్ప్లాంటు సీఎండీ అతుల్భట్ పేర్కొన్నారు. గంగవరం పోర్టులో అంతరాయాల దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్లాంటుకు అవసరమైన బొగ్గును తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నామన్నారు. సమస్య పరిష్కారానికి మార్గనిర్దేశనం చేసిన ఉక్కు మంత్రిత్వశాఖకు, దృఢమైన మద్దతు తెలిపినందుకు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లకు సీఎండీ కృతజ్ఞతలు తెలిపారు.