Share News

ఏసీబీ వలలో వీఆర్వో

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:42 PM

నాతవరం తహసీల్దార్‌ కార్యాలయంలో ఓ రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వో, వీఆర్‌ఏలను ఏసీబీ అధికారులు సోమవారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏసీబీ వలలో వీఆర్వో
ఏసీబీ అధికారులకు పట్టుబడిన గుమ్మిడిగొండ వీఆర్వో సింహాచలం, వీఆర్‌ఏ లోవరాజు

వీఆర్‌ఏ కూడా..

రైతు నుంచి లంచం తీసుకుంటూ చిక్కిన వైనం

నాతవరం, మార్చి 4: నాతవరం తహసీల్దార్‌ కార్యాలయంలో ఓ రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వో, వీఆర్‌ఏలను ఏసీబీ అధికారులు సోమవారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ రమ్య తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. నాతవరం మండలం గుమ్మిడిగొండ గ్రామానికి చెందిన అడిగర్ల వంశీకృష్ణ అనే రైతు తన తండ్రి పేరున ఉన్న రెండు ఎకరాల 16 సెంట్ల భూమికి సంబంధించి మ్యూటేషన్‌, అడంగల్‌ కరెక్షన్‌కు గుమ్మిడిగొండ గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో) జుర్రా సింహాచలం, గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) చేవళ్ల లోవరాజును సంప్రతించాడు. దీంతో రూ.8 వేలు లంచం ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. దీనిపై ఆ రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు ఆ రైతు సోమవారం సాయంత్రం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాడు. వీఆర్వో సింహాచలానికి రూ.6 వేలు, వీఆర్‌ఏ లోవరాజుకు రూ.2 వేలు ఇచ్చాడు. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాత్రి వరకు తహసీల్దార్‌ కార్యాలయంలోనే విచారణ జరిపారు. వీఆర్వో, వీఆర్‌ఏలను మంగళవారం విశాఖలోని ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్టు అధికారులు తెలిపారు.

ఏసీబీకి చిక్కుతున్నా మారని వైఖరి

నాతవరం తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేసే వీఆర్వోలు లంచం తీసుకుంటూ తరచూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నా వారి తీరు మారడం లేదని పలువురు రైతులు పేర్కొంటున్నారు. గతంలో నాతవరం మండలం ఎం.బెన్నవరంలో ఇద్దరు వీఆర్వోలు రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇటీవల పీకేగూడెంలో రైతు నుంచి లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జిల్లేడిపూడి, శంగవరం వీఆర్వోలు కూడా ఎసీబీ అధికారులకు గతంలో పట్టుబడ్డారు. గతంలో ఓ తహసీల్దార్‌ కూడా ఏసీబీ అధికారులకు చిక్కారు. అయినా ఇక్కడి రెవెన్యూ అధికారుల వైఖరి మారడం లేదని స్థానికులు చెబుతున్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:42 PM