బీచ్లో ఇష్టారాజ్యంగా పనులు
ABN , Publish Date - Feb 17 , 2024 | 01:10 AM
భీమిలిలో బీచ్ను ఆనుకొని వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు.
![బీచ్లో ఇష్టారాజ్యంగా పనులు](https://media.andhrajyothy.com/media/2024/20240215/IMG_20240216_WA_0078_e720330197.jpg)
తెర వెనుక వైసీపీ పెద్దలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి):
భీమిలిలో బీచ్ను ఆనుకొని వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు. గతంలో అక్కడ ఒక రొయ్యల హేచరీ ఉండేది. జిరాయితీ భూమి కాగా దానిని వైసీపీ నేతలు కొనుగోలు చేశారు. తీరంలో ఎలాంటి నిర్మాణాలు చేయడానికి వీల్లేదు. దాంతో కోస్తా నియంత్రణ మండలి జోన్(సీఆర్జెడ్) అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుంది. 2019లో సీఆర్జెడ్ కొత్త చట్టం తెచ్చినప్పటికీ రాష్ట్రంలో అది ఇంకా అమలు కాలేదు. 2011లో చేసిన చట్టమే అమలులో ఉంది. దాంతో ఈ స్థలంలో నిర్మాణాలకు అనుమతులు రాలేదని తెలిసింది. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా బీచ్ను కూడా కలిపేసుకొని ప్రహరీ నిర్మిస్తున్నారు. కొనుగోలు చేసిన జిరాయితీ భూమి కంటే అధిక విస్తీర్ణంలో యంత్రాలతో పనులు చేస్తున్నారు. ఎవరైనా తీరంలో చిన్న నిర్మాణం చేపడితే అడ్డం పడే అధికారులు అక్కడ మూడు వారాలుగా పనులు జరుగుతున్నా కన్నెత్తి చూడడం లేదు. కెరటాలు తాకేంత వరకు భూమి తమదే అన్నట్టుగా పనులు చేస్తున్నారు. తక్షణమే జిరాయితీ భూమికి సరిహద్దులు నిర్ణయించి, ఆ మేరకే పనులు చేసుకునేలా ఆంక్షలు విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.