మత్స్యకార బోట్లకు ట్రాన్స్పాండర్లు
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:26 AM
సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ప్రమాదంలో చిక్కుకుంటే రక్షించేందుకు వీలుగా ‘ట్రాన్స్పాండర్లు’ (వైర్లెస్ కమ్యూనికేషన్కు సంబంధించిన పరికరం) ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు చేపట్టింది.

సముద్రంలో ఎక్కడున్నదీ చెబుతుంది
ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగితే సులువుగా సమాచారం
తక్షణం రక్షణ చర్యలకు అవకాశం
మూడు నెలల క్రితమే పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
విశాఖలో ఐదు బోట్లకు అమర్చిన మత్స్యశాఖ అధికారులు
పీకి పక్కన పడేసిన యజమానులు
(విశాఖఫట్నం-ఆంధ్రజ్యోతి)
సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ప్రమాదంలో చిక్కుకుంటే రక్షించేందుకు వీలుగా ‘ట్రాన్స్పాండర్లు’ (వైర్లెస్ కమ్యూనికేషన్కు సంబంధించిన పరికరం) ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద తీరప్రాంత రాష్ట్రాలకు 3.5 లక్షల పరికరాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇవి ఇస్రో టెక్నాలజీతో పనిచేస్తాయి.
‘ట్రాన్స్పాండర్’ అనేది వైర్లెస్ టెక్నాలజీతో రూపొందించిన పరికరం. రేడియో ఫ్రీక్వెన్సీతో పనిచేస్తుంది. దీని ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకోవచ్చు. మొబైల్ ఫోన్లో ఎలాగైతే టెక్ట్స్ మెసేజ్ చేసుకుంటారో ఇందులో కూడా అలా సమాచారం పంపుకోవచ్చు. సముద్రంలో ఎక్కడున్నా ఇది పనిచేస్తుంది. ట్రాన్స్పాండర్ని అమర్చేటపుడు దానిని సంబంధిత ఫిషింగ్ హార్బర్లోని మత్స్య శాఖ అధికారులతో లింకప్ చేస్తారు. ఆ బోటు సముద్రంలో ఎక్కడ తిరిగినా ఆ సమాచారం మత్స్య శాఖలో రిజిస్టర్ అవుతుంది. ఎంత దూరం వేటకు వెళ్లింది?, ఏ హార్బర్కు దగ్గరలో ఉంది?...అనే విషయాలు తెలుస్తాయి. అనుకోకుండా ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆ సమాచారం బోటు నుంచి అందితే...వారు ఎక్కడున్నదీ అధికారులు సులభంగా గుర్తించగలుగుతారు. వెంటనే అక్కడకు కోస్టుగార్డును పంపించి రక్షిస్తారు.
ట్రాన్స్పాండర్ బ్యాటరీతో పనిచేస్తుంది. బోటులో ఇంజిన్కి కనెక్ట్ చేస్తారు. ఇంజన్ రన్నింగ్లో ఉన్నంత సేపు ఇది ఆన్లోనే ఉంటుంది. మత్స్యకారులు ఒక్కోసారి ఇంజిన్ ఆపేసి సముద్రం మధ్యలో బోటును లంగరేసి వేట సాగిస్తారు. అటువంటి సమయాల్లో ఈ పరికరం పనిచేయడానికి బ్యాటరీ అవసరం అవుతుంది. అందుకని సోలార్ బ్యాటరీ ఏర్పాట్లు కూడా చేశారు. కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఖర్చు భరించి వీటిని ఏర్పాటుచేయనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి చాలా స్పల్ప మొత్తంలో వీటిని ఇచ్చారు. విశాఖపట్నం జిల్లాకు కేవలం ఐదు మాత్రమే ఇచ్చారు. వాటిని ఇక్కడి మత్స్య శాఖ అధికారులు మూడు నెలల క్రితం ఐదు మెకనైజ్డ్ బోట్లకు అమర్చారు. వాటి పనితీరు ఆధారంగా మిగిలిన బోట్లకు అమర్చాలనేది ప్రభుత్వం ఆలోచన. అయితే అధికారులు ఇచ్చిన ట్రాన్స్పాండర్లను మత్స్యకారులు తీసి పక్కన పడేశారు. వాటిని ఉపయోగించడం లేదు. దానివల్ల బోటు ఎంతదూరం తిరిగింది?, ఎక్కడెక్కడికి వెళ్లింది...అనే సమాచారం అధికారులకు తెలుస్తుంది. ఆ వివరాలు గుట్టుగా ఉంచడానికో...మరే కారణమో తెలియదు కానీ వాటిని మత్స్యకారులు ఉపయోగించడం లేదు. అధికారులు కూడా దీనిపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. దాంతో ప్రమాదంలో చిక్కుకుంటే సులభంగా గుర్తించే అవకాశం మత్స్యకారులు పోగొట్టుకున్నట్టు అయింది. ప్రభుత్వం బోట్లకు సబ్సిడీపై డీజిల్ ఇస్తోంది. వేటకు వెళ్లని బోట్లకు ఇవ్వడం లేదు. కోత విధిస్తోంది. ట్రాన్స్పాండర్లు ఉంటే ఆ బోటు వేటకు వెళ్లిందీ లేనిదీ అధికారులకు సులువుగా తెలిసిపోతుంది. అటువంటి సమాచారం వారికి అందకుండా చేయడానికే వాటిని బోట్ల నుంచి తొలగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మత్స్యకారుల సంక్షేమం, భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త తరహా ప్రయత్నాలు చేస్తుంటే వాటికి వారు సహకరించడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది.
వారు తొలగించేశారు
విజయకృష్ణ, జేడీ, మత్స్య శాఖ
విశాఖపట్నం హార్బర్లో ఐదు బోట్లకు ట్రాన్స్పాండర్లను అమర్చాం. కానీ వాటిని వారు ఉపయోగించడం లేదు. రెండు, మూడు సార్లు చెప్పి చూశాము. అయినా సరే ప్రయోజనం లేదు. వేరే బోట్లకు అమర్చే యోచన చేస్తున్నాము.