నేడు చంద్రబాబు ప్రజాగళం
ABN , Publish Date - Apr 14 , 2024 | 01:18 AM
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదివారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని పాయకరావుపేట, గాజువాకల్లో ప్రజాగళం సభల్లో పాల్గొంటారు.
![నేడు చంద్రబాబు ప్రజాగళం](https://media.andhrajyothy.com/media/2024/20240413/babu_5d13b01e07.jpg)
సాయంత్రం 5.35 గంటలకు గాజువాకలో సభ
విశాఖపట్నం/గాజువాక, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి):
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదివారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని పాయకరావుపేట, గాజువాకల్లో ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. ఆయన మధ్యాహ్నం 12.55 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 2.05 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. ఎయిర్పోర్టు నుంచి 2.10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 2.35 గంటలకు పాయకరావుపేట వెళతారు. అక్కడ సూర్యమహల్ సెంటర్లో ఏర్పాటుచేసిన సభలో పాల్గొంటారు. సభ అనంతరం సాయంత్రం 4.40 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 5.15 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరు కుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన 5.35 గంటలకు పాతగాజువాక చేరుకుంటారు. సాయంత్రం ఆరు నుంచి 7.30 గంటల వరకు ఎన్నికల సభలో పాల్గొంటారు. అనంతరం 7.40 గంటలకు ఎయిర్పోర్టుకు చేరుకుని, రాత్రి ఎనిమిది గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళతారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత తొలిసారిగా చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తున్నారు. ఆదివారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, చోడవరం, గాజువాక సభలకు తొలుత ఏర్పాట్లుచేశారు. అయితే ఒకేరోజు మూడుచోట్ల సభలు నిర్వహణ సాధ్యంకాదని పాయకరావుపేట, గాజువాకలను ఖరారుచేశారు. ఈనెల 16వ తేదీన అనకాపల్లి జిల్లా చోడవరం, ఎలమంచిలిలో చంద్రబాబునాయుడుతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల సభల్లో పాల్గొననున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.
విమానాశ్రయం నుంచి బైక్ ర్యాలీ
ఆదివారం గాజువాకలో ప్రజాగళం సభ నిర్వహించనున్న ప్రాంతాన్ని శనివారం విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు గండి బాబ్జీ, గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు పరిశీలించారు. గాజువాక 60 ఫీట్ రోడ్డులో సాయంత్రం ఆరు గంటలకు సభ ప్రారంభం కానుందని తెలిపారు. వేలాది మంది ప్రజలు హాజరుకానుండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, విమానాశ్రయం నుంచి గాజువాక వరకు వేలాది బైక్లతో ర్యాలీ నిర్వహించనున్నామని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. వారి వెంట నాయకులు ప్రసాదుల శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, నల్లూరు సూర్యనారాయణ, గోమాడ వాసు, అనంత్, రామకృష్ణ పాల్గొన్నారు.