వ్యాన్ బోల్తా
ABN , Publish Date - Mar 24 , 2024 | 12:42 AM
స్టీరింగ్ రాడ్డు విరిగి వ్యాన్ బోల్తా పడిన సంఘటన శనివారం అనకాపల్లి మండలం శంకరం వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. దీనికి సంబంధించి అనకాపల్లి రూరల్ ఎస్ఐ తేజేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
- ఇద్దరు కూలీలు మృతి
కొత్తూరు/దేవరాపల్లి, మార్చి 23 : స్టీరింగ్ రాడ్డు విరిగి వ్యాన్ బోల్తా పడిన సంఘటన శనివారం అనకాపల్లి మండలం శంకరం వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. దీనికి సంబంధించి అనకాపల్లి రూరల్ ఎస్ఐ తేజేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. నక్కపల్లిలో కాంట్రాక్టు పనులు చేసేందుకు నలుగురు కూలీలు పెందుర్తి నుంచి ఫ్లోరింగ్ టైల్స్ లోడుతో వ్యాన్లో బయలుదేరారు. అనకాపల్లి మండలం శంకరం ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు వచ్చేసరికి వ్యాన్ స్టీరింగ్ రాడ్డు విరిగిపోయి పక్కనే ఉన్న డివైడర్ పైకి దూసుకువెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యానులో ప్రయాణిస్తున్న నలుగురు కూలీలలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు దేవరాపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందిన ఆదిరెడ్డి గంగునాయుడు(65), పూడి గంగునాయుడు (70)గా పోలీసులు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన కామిరెడ్డి ముత్యాలనాయుడు, గొర్లి అప్పారావులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
పెళ్లి ఇంట విషాదం
ఈ ప్రమాదంలో మృతి చెందిన పూడి గంగునాయుడు కుమారుడు జోగినాయుడు వివాహం వచ్చే నెల 13న జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభించారు. అయితే గంగునాయుడు మరణ వార్త తెలిసి ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.