వేతనం పెంపు హామీ ఐదేళ్లయినా అమలు చేయలేదు
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:43 AM
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సోమవారం నెహ్రూచౌక్ వద్ద ధర్నా చేపట్టారు.
భోజన పథకం కార్మికులకు రాష్ట్ర సంఘం అధ్యక్షురాలు వరలక్ష్మి ధ్వజం
డిమాండ్ల సాధనకు కార్మికులు ధర్నా
అనకాపల్లి టౌన్, ఫిబ్రవరి 5: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సోమవారం నెహ్రూచౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.వరలక్ష్మి మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి రాకముందు జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సందర్భంగా భోజన పథకం కార్మికులకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, ఐదేళ్లయినా అమలు చేయకపోవడం దారుణమని అన్నారు. ప్రతి నెల ఐదో తేదీలోపు వేతనాలు, బిల్లులు ఇవ్వాలని, మెనూ చార్జీలను రూ.20కి పెంచాలని, ప్రభుత్వమే వంట గ్యాస్ సరఫరా చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించవద్దని కోరారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఏటా రెండు జతలు యూనిఫాం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఎం.శ్రీదేవి, ఎస్.గౌరి, ఎస్.అమ్మాజీ, ఎస్కే బాబీ తదితరులు పాల్గొన్నారు.