పోలీసు యంత్రాంగం అప్రమత్తం
ABN , Publish Date - May 24 , 2024 | 12:52 AM
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తరువాత కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు, హింసాత్మక సంఘటనలకు అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో ఈనెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా చెదురుమదురు సంఘటనలు మినహా ఎటువంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోలేదు. అయినా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు జిల్లా అంతటా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
![పోలీసు యంత్రాంగం అప్రమత్తం](https://media.andhrajyothy.com/media/2024/20240511/23akp2_6d8fb1b7b4.jpg)
- జిల్లాలో 202 గ్రామాలపై ప్రత్యేక పోలీసు నిఘా
- ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమలు
- స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తరువాత కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు, హింసాత్మక సంఘటనలకు అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో ఈనెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా చెదురుమదురు సంఘటనలు మినహా ఎటువంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోలేదు. అయినా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు జిల్లా అంతటా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
ఓట్ల లెక్కింపునకు ముందు, తరువాత ఎటువంటి అల్లర్లకు అవకాశం లేకుండా జిల్లాలో 24 మండలాల పరిధిలో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడమే కాకుండా 202 గ్రామాల్లో వివాదాలు చోటు చేసుకొనే అవకాశాలున్నట్టు గుర్తించి ఆయా గ్రామాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో కవాతు నిర్వహించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పోలీసు నిఘా కొనసాగనుంది. జిల్లాలో 30 పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఎటువంటి పత్రాలు లేని వాహనాలను నడుపుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.