ముసుగు తొలగింది
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:27 AM
ఎన్నికలు సమీపించేసరికి గ్రామ, వార్డు వలంటీర్లు రాజకీయ ముసుగు తొలగించి, అసలు స్వరూపం బయటపెడుతున్నారు.

ఎన్నికల్లో వైసీపీ తరపున పనిచేసేందుకు సిద్ధమైన పలువురు వలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు
అధికారుల కంటే ముందు అధికార పార్టీ నేతల ముందు రాజీనామా లేఖల ప్రదర్శన
జగన్ రుణం తీర్చుకుంటామని నినాదాలు
నెలకు రూ.15 వేలు ఇస్తామంటూ నేతల ఆఫర్
అధికారంలోకి వస్తే మళ్లీ తీసుకుంటామని హామీ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఎన్నికలు సమీపించేసరికి గ్రామ, వార్డు వలంటీర్లు రాజకీయ ముసుగు తొలగించి, అసలు స్వరూపం బయటపెడుతున్నారు. పింఛన్ల పంపిణీకి దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడంతో స్థానిక రాజకీయ నేతల ఒత్తిళ్లలో మూకుమ్మడిగా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో పెందుర్తి మండలంలో 30 మంది, పరవాడ మండలం తానాంలో 23 మంది రాజీనామా చేశారు. అలాగే అనకాపల్లి జిల్లా కశింకోట పంచాయతీలో అయితే ఏకంగా 89 మంది వలంటీర్లు రాజీనామాలు సమర్పించారు. అదే మండలం బయ్యవరంలో మరో 14 మంది రాజీనామా చేశారు. వీటి వెనుక వైసీపీ నేతల ప్రోద్బలం ఉందనేది సుస్పష్టం. తానాంలో రాజీనామా చేసిన వలంటీర్లు అక్కడి జెడ్పీటీసీ సభ్యుడు పైలా సన్యాసిరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అదీప్రాజ్ను కలిశారు. తమ రాజీనామా పత్రాలను ప్రదర్శిస్తూ ‘జై జగన్...జైజై అదీప్ రాజు...’ అంటూ నినాదాలు చేశారు. జగన్ రుణం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ కూడా చేయించారు.
ఇన్నాళ్లూ వలంటీర్లు స్వచ్ఛంద సేవకులని వైసీపీ పెద్దలు చెప్పుకొచ్చారు. కేవలం రూ.5 వేల గౌరవ వేతనానికే పనిచేస్తున్నారని వారిని ప్రశంసించారు. కానీ పార్టీ కోసం పనిచేసేలా వారికి శిక్షణ ఇచ్చారు. వారి ద్వారానే గ్రామాలు, వార్డుల్లో ఓటర్ల వివరాలు తీసుకోవడం, ఓటర్లకు కానుకలు పంపిణీ చేయడం చేశారు. నగరంలో కార్పొరేటర్లు, గ్రామాల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, నాయకులు వారిని (వలంటీర్లను) పార్టీ క్రియాశీలక కార్యకర్తల్లా భావిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన నేపథ్యంలో నాయకులు ఎక్కడికక్కడే సమావేశాలు నిర్వహించి, వలంటీరు పోస్టుకు రాజీనామాలు చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. అలా చేస్తే నెలకు రూ.15 వేలు వరకు ఇస్తామని ఆశ చూపుతున్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే అందరినీ వలంటీర్లుగా తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు. ఈ మూడు నెలలు పార్టీకి పనిచేయాలని, ఏ అధికారి ఏమీ అనకుండా తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు. తమ చేతులు మీదుగానే నియమించిన వలంటీర్లను ఆయా నాయకులు రెండు రోజుల నుంచి ఇళ్లకు పిలిచి మూకుమ్మడిగా రాజీనామాలు చేయిస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. రాజీనామాకు కారణం ఏమి రాశారు? అనే విషయాన్ని అధికారులు వెల్లడించడం లేదు. అధికార పార్టీకి భయపడి ఆ పత్రాలను బయటపెట్టడం లేదు. పోస్టులకు రాజీనామా చేసినవారు ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించకూడదని అధికారులు హెచ్చరించడం లేదు. అలా చేస్తే ఏ ఉద్యోగాలు రావని కూడా చెప్పడం లేదు. వారు కూడా అధికార పార్టీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు.
ఇదీ అసలు కారణం?
కేంద్ర ఎన్నికల సంఘం మూడేళ్లకు పైబడిన అధికారులను ఆయా ప్రాంతాల నుంచి బదిలీ చేసినట్టే...గత నాలుగేళ్లుగా గ్రామాలు, వార్డుల్లో పనిచేస్తున్న వలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం కాకూడదని స్పష్టంచేసింది. ప్రతి నెలా వీరి ద్వారా ఇంటింటికీ సంక్షేమ పథకాలు, పెన్షన్లు ఇస్తున్నందున ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని, ఆ పనులు కూడా వారికి అప్పగించవద్దని ఆదేశించింది. ఏప్రిల్ ఒకటో నుంచి పింఛన్ల పంపిణీ బాధ్యతలు ఇవ్వవద్దని సూచించింది. దీనిని అధికార పార్టీ వైసీపీ జీర్ణించుకోలేకపోయింది. అసలు పింఛన్లు ఇవ్వడానికి నిధులు లేవనే విషయం దాచిపెట్టి, ప్రతిపక్ష పార్టీలు కుట్ర వల్లే ఇదంతా జరుగుతున్నదని దుష్ప్రచారం ప్రారంభించింది. పేదలు, వృద్ధులకు పింఛన్లు సకాలంలో ఇవ్వడం కష్టమేనని ప్రచారం ప్రారంభించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో బుధవారం నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీకి ఏర్పాట్లుచేసింది.
కొనసాగుతున్న వలంటీర్ల రాజీనామాలు
పెందుర్తి మండలంలో 30 మంది...
పరవాడ మండలంలో 23 మంది
కశింకోట మండలంలో 104 మంది
పెందుర్తి, ఏప్రిల్ 2:
విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాల పరంపర కొనసాగుతోంది. దీనివెనుక వైసీపీ బలమైన వ్యూహం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళవారం మరో 16 మంది వలంటీర్లు రాజీనామా చేసినట్టు ఎంపీడీవో కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇందులో ఎమ్మెల్యే అదీప్రాజ్ స్వగ్రామమైన రాంపురంలో 14 మంది, గొరపల్లికి చెందిన ఇద్దరు వలంటీర్లు ఉన్నారు. సోమవారం గొరపల్లిలో 13 మంది, గత నెల 30వ తేదీన రాజయ్యపేటలో ఒకరు రాజీనామా చేశారు. దీంతో మండలంలో రాజీనామా చేసిన వలంటీర్ల సంఖ్య సుమారు 30 మందికి చేరినట్టు ఎంపీడీవో రవికుమార్ తెలిపారు.
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తానాం గ్రామానికి చెందిన 23 మంది వలంటీర్లు ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసేందుకు వీలుగా రాజీనామా చేశారు. ఈ వ్యవహారంలో ఓ వైసీపీ నేత కీలకపాత్ర పోషించినట్టు సమాచారం.
కశింకోట మండలంలో 104 మంది రాజీనామా
అనకాపల్లి జిల్లా కశింకోట మేజర్ పంచాయతీ పరిధిలోని నాలుగు సచివాలయాల పరిధిలో 89 మంది వలంటీర్లు మంగళవారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కాగా మొత్తం 91 మంది ఉండగా వారిలో ఇద్దరు గతంలోనే రాజీనామా చేశారురు. ఈ మేరకు వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు, వేలిముద్ర పరికరాన్ని అందజేశారని పంచాయతీ కార్యదర్శి రమేష్ తెలిపారు.
15 మంది వలంటీర్లు రాజీనామా
కశింకోట మండలం బయ్యవరం గ్రామానికి చెందిన 14 మంది వలంటీర్లు, విస్సన్నపేట గ్రామానికి చెందిన ఒక వలంటీరు మంగళవారం రాజీనామా చేశారని ఎంపీడీవో శేషుబాబు తెలిపారు. తమ వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశామని వారు ఇచ్చిన లేఖలో పేర్కొన్నట్టు చెప్పారు. కాగా ఎన్నికల కమిషన్ ఆదేశాల నేపథ్యంతో తమ వద్ద ఉన్న ట్యాబ్లు, సెల్ఫోన్లు తిరిగి ఇచ్చేశారని ఎంపీడీవో తెలిపారు.
అనకాపల్లిలో ఒకరు...
జీవీఎంసీ 11వ వార్డు సచివాలయంలో వలంటీర్గా పనిచేస్తున్న శఠగోపం వెంకటవిజయ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ లేఖ ఇచ్చినట్టు అనకాపల్లి జోనల్ కమిషనర్ అయ్యప్పనాయుడు మంగళవారం తెలిపారు.