అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకుపోయిన కారు
ABN , Publish Date - Jan 14 , 2024 | 01:12 AM
తాండవ షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒక మహిళకు గాయాలవ్వగా, మరో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు.
![అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకుపోయిన కారు](https://media.andhrajyothy.com/media/2023/20231205/13pap3_03aa3b4a28.jpg)
ఒకరికి స్వల్ప గాయాలు, క్షేమంగా బయటపడిన మరో ముగ్గురు
పాయకరావుపేట, జనవరి 13: తాండవ షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒక మహిళకు గాయాలవ్వగా, మరో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఎస్.సతీశ్ తన భార్య, కుమారుడు, అత్తతో కలిసి సంక్రాంతి పండుగ సందర్భంగా నాతవరం మండలం గునుపూడిలో బంధువుల ఇంటికి కారులో బయలుదేరారు. శనివారం ఉదయం పాయకరావుపేట వద్ద నర్సీపట్నం రోడ్డులో తాండవ షుగర్ ఫ్యాక్టరీ మలుపు వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పింది. ఎదురుగా ఉన్న భూమి ఛానెల్ పంట కాలువలోకి దూసుకుపోయింది. స్థానికులు వెంటనే కాలువలోకి దిగి కారులో ఉన్న వ్యక్తులను బయటకు తీసుకువచ్చారు. సతీశ్ అత్త నూకరత్నంకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమెను తుని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు.