విజయీభవ సందడి
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:42 AM
అనకాపల్లి పట్టణంలో బుధవారం సాయంత్రం సందడి నెలకొంది. బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయీభవ ర్యాలీలో కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్నాథ్సింగ్ పాల్గొనడంతో ఆయనకు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. నేల వేషాలు, డప్పు వాయిద్యాలు, కళాకారుల ప్రదర్శనలతో అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఈ ర్యాలీ సాయంత్రం ఆరు గంటలకు అనకాపల్లి పట్టణంలోని సుంకరమెట్ట వద్ద ప్రారంభమై రింగురోడ్డు, చిననాలుగురోడ్ల కూడలి మీదుగా నెహ్రూచౌక్ కూడలికి చేరుకుంది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.
- కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్నాథ్సింగ్కు ఘన స్వాగతం
- అడుగడుగునా నీరాజనం
- కూటమి శ్రేణులతో కిక్కిరిసిన రహదారులు
కొత్తూరు, ఏప్రిల్ 24: అనకాపల్లి పట్టణంలో బుధవారం సాయంత్రం సందడి నెలకొంది. బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయీభవ ర్యాలీలో కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్నాథ్సింగ్ పాల్గొనడంతో ఆయనకు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. నేల వేషాలు, డప్పు వాయిద్యాలు, కళాకారుల ప్రదర్శనలతో అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఈ ర్యాలీ సాయంత్రం ఆరు గంటలకు అనకాపల్లి పట్టణంలోని సుంకరమెట్ట వద్ద ప్రారంభమై రింగురోడ్డు, చిననాలుగురోడ్ల కూడలి మీదుగా నెహ్రూచౌక్ కూడలికి చేరుకుంది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.
మోదీ ఆశీస్సులతో ముందడుగు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతోనే కూటమి ముందడుగు వేస్తోందని బీజేపీ అనకాపల్లి అభ్యర్థి సీఎం రమేశ్ తెలిపారు. విజయీభవ ర్యాలీలో భాగంగా నెహ్రూచౌక్ కూడలిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. కేంద్రంలో మోదీ ఆశీస్సులు, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఆశీస్సులు ఉన్నంత వరకూ రాష్ట్రం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని తెలిపారు. అనకాపల్లి అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. డబుల్ ఇంజన్ అంటే అభివృద్ధి, సంక్షేమం అని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందన్నారు. అనకాపల్లిలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందకుండా పోయాయన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంపీగా అనకాపల్లి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. టీడీపీ నర్సీపట్నం అభ్యర్థి సీహెచ్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలన సాగుతోందని, 99 శాతం హామీలు నెరవేర్చామని అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కేంద్రంలోని పెద్దలతో మంచి సంబంధాలున్న సీఎం రమేశ్ను ఎంపీగా గెలిపించుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించి సైకో, దుర్మార్గ పాలనను అంతమొందించాలన్నారు. జనసేన అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, దేశంలో మోదీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపడితేనే ఆంధ్రా అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ర్యాలీలో జనసేన ఎలమంచిలి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయకుమార్, టీడీపీ చోడవరం అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు, టీడీపీ మాడుగుల అభ్యర్థి బండారు సత్యనారాయణ, టీడీపీ పాయకరావుపేట అభ్యర్థిని వంగలపూడి అనిత, జనసేన పెందుర్తి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ద నాగజగదీశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ మాదవ్ తదితరులు పాల్గొన్నారు.