వల్సంపేటలో ఉద్రిక్తత
ABN , Publish Date - Mar 03 , 2024 | 12:58 AM
మండలంలోని వల్సంపేటలో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలం ఆక్రమణ విషయంలో అధికార వైసీపీకి చెందిన ఇరువర్గాలు కొట్లాటకు దిగాయి. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
- రూ.2 కోట్ల విలువైన స్థలం ఆక్రమణపై వివాదం
- వైసీపీకి చెందిన ఇరువర్గాల మధ్య కొట్లాట
- స్థలం చుట్టూ కంచె వేసిన మాజీ సర్పంచ్ వర్గీయుడు
- కంచెను కొంత మేర తొలగించిన సర్పంచ్, ఆమె భర్త
- ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం
నాతవరం, మార్చి 2: మండలంలోని వల్సంపేటలో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలం ఆక్రమణ విషయంలో అధికార వైసీపీకి చెందిన ఇరువర్గాలు కొట్లాటకు దిగాయి. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
నాతవరం మండలం వల్సంపేట పంచాయతీ సర్వే నంబరు 180లో రూ.2 కోట్లు విలువైన 32 సెంట్ల ప్రభుత్వ స్థలం ఆక్రమణ విషయమై వివాదం తలెత్తింది. మాజీ సర్పంచ్ సుర్ల యోగి వర్గీయుడు మూడు రోజుల క్రితం ఆ స్థలం చుట్టూ ఇనుప కంచె వేశారని, దీని వల్ల ఆ స్థలం మీదుగా పొలాలకు వెళ్లే సుమారు 150 మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ ఇటంశెట్టి శ్యామల తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె శనివారం తన భర్త శ్రీనివాస్తో కలిసి ఆ స్థలం వద్దకు వెళ్లి ఇనుప కంచెను కొంత మేర తొలగించారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న మాజీ సర్పంచ్ సుర్ల యోగి, అతని వర్గీయులు వారిని అడ్డుకున్నారు. సర్పంచ్ భర్త శ్రీనివాస్, మాజీ సర్పంచ్ యోగి మధ్య తోపులాట జరిగింది. దీంతో వారిరువురికి చెందిన అనుచరులు ఘర్షణ పడ్డారు. వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో నాతవరం ఎస్ఐ రామారావు రంగంలోకి దిగి వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో నర్సీపట్నం సీఐ బి.హరికి పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన నర్సీపట్నం రూరల్ ఎస్ఐ భీమరాజు, సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. గుమిగూడిన ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ యోగి మాట్లాడుతూ ఈ స్థలంలో ఇరవై ఏళ్లుగా వియ్యపు గణేశ్ నివాసముంటున్నాడని, అందుకే స్థలం చుట్టూ కంచె వేసుకున్నా డన్నారు. సర్పంచ్ శ్యామల మాట్లాడుతూ ఈ స్థలం ఆక్రమణకు గురైందని, ఆక్రమణలను తొలగించి రైతు భరోసా కేంద్రానికి కేటాయించడం లేదా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గతంలో కలెక్టర్, తహసీల్దార్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. సంఘటన స్థలానికి చేరుకున్న తహసీల్దార్ రమేశ్కుమార్ ఈ స్థలం ఎవరిదని వీఆర్వో మూర్తిని అడిగారు. ఇది ప్రభుత్వ స్థలమని వీఆర్వో తెలపగా, ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. అయితే వల్సంపేటలో మరో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు ఉన్నాయని, వాటిని కూడా తొలగించాలని మాజీ సర్పంచ్ డిమాండ్ చేశారు. తహసీల్దార్ రమేశ్కుమార్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి గొడవలు వద్దని సూచించారు. సర్వే నంబరు 180లో 32 సెంట్ల భూమి వివరాల రికార్డులను వెంటనే తనకు అందించాలని వీఆర్వో మూర్తిని ఆదేశించారు. ఇరు వర్గాలతో నాతవరం ఎస్ఐ రామారావు కొంతసేపు చర్చించారు. శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగితే ఇరువర్గాలపై కేసులు పెడతామని హెచ్చరించారు.