పండుగలా టీడీపీ సభ్యత్వ నమోదు
ABN , Publish Date - Oct 27 , 2024 | 12:48 AM
అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం పండుగ వాతావరణంలో జరిగింది.
హాజరైన బత్తుల, పీలా, బుద్ద
అనకాపల్లి టౌన్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం పండుగ వాతావరణంలో జరిగింది. స్థానిక నెహ్రూచౌక్లో అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గ ఇన్చార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావులు పాల్గొన్న కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదు చేసుకున్నారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి నాగజగదీశ్వరరావు, తాతయ్యబాబు, గోవింద సత్యనారాయణలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ శ్రేణులు ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలన్నారు. రూ.100లతో సభ్యత్వ నమోదు చేసుకుంటే రూ.ఐదు లక్షల ప్రమాద బీమా, పార్టీ శ్రేణుల కుటుంబసభ్యులకు విద్య, వైద్యానికి ఆర్థిక సహాయం వంటివి ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కల్పించారన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి కార్యకర్తలకు అండగా ఉంటున్నారన్నారు. తొలి సభ్యత్వాన్ని పీలా తీసుకోగా, జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ, పార్టీ నాయకులు మళ్ల సురేంద్ర, బీఎస్ఎంకే జోగినాయుడు, సబ్బవరపు గణేష్, పచ్చికూర రాము, గొంతిన శ్రీనివాసరావు, రాపేటి రామ్కుమార్, కొణతాల రత్నకుమారి, ఎస్. పద్మలత తదితరులు పాల్గొన్నారు.