ఇంటర్మీడియట్ పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:45 AM
జిల్లాలో శుక్రవారం నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు.
![ఇంటర్మీడియట్ పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు](https://media.andhrajyothy.com/media/2024/20240229/29akprural1_2b2a1e77ec.jpg)
ఎస్పీ కేవీ మురళీకృష్ణ
అనకాపల్లి రూరల్, ఫిబ్రవరి 29: జిల్లాలో శుక్రవారం నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు తీసుకున్న చర్యలపై గురువారం ఆయన వివరించారు. ఈ మేరకు ఆయన పోలీసు కార్యాలయంలో మాట్లాడారు. జిల్లాలో 38 కేంద్రాల్లో 28,621 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారని, వీరంతా ఉదయం ఎనిమిది గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం తొమ్మిది గంటలకు ఒక్క నిమిషం దాటినా అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయన్నారు. పరీక్ష పూర్తయ్యే వరకు పరీక్షా కేంద్రం నుంచి విద్యార్థులను బయటకు అనుమతించబోమన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, బ్లూటూత్, స్మార్ట్ వాచీలు, ఎలక్ర్టానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమన్నారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలను ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు.