Share News

ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ABN , Publish Date - Apr 12 , 2024 | 01:02 AM

స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పీఎఫ్‌) కానిస్టేబుల్‌ ఒకరు గురువారం తుపాకీ (సింగిల్‌ బెరల్‌ గన్‌)తో గుండెపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

బ్యాంక్‌ కరెన్సీ చెస్ట్‌లో తుపాకీతో కాల్చుకుని అఘాయిత్యం

సీతంపేట, ఏప్రిల్‌ 11:

స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పీఎఫ్‌) కానిస్టేబుల్‌ ఒకరు గురువారం తుపాకీ (సింగిల్‌ బెరల్‌ గన్‌)తో గుండెపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, సహ ఉద్యోగులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా వంగర మండలం కొట్టిస గ్రామానికి చెందిన పాలవలస శంకరరావు (35), భార్య శ్రావణి, ఇద్దరు పిల్లలు కుమారుడు కిశోర్‌, కుమార్తె జ్ఞానవితతో కలిసి మద్దిలపాలెం ప్రాంతంలోని పీతలవానిపాలెంలో నివాసం ఉంటున్నారు. శంకరరావు ఉద్యోగంలో అందరితో కలిసిమెలిసి ఉండేవారు. రోజూ మాదిరిగానే గురువారం ఉదయం ఐదు గంటలకు ద్వారకా నగర్‌లో గల ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు చెస్ట్‌లో సెంట్రీ డ్యూటీలో చేరారు. ఉదయం ఏడు గంటల సమయంలో తన చేతిలో ఉన్న ఎస్‌ఎల్‌ఆర్‌ వెపన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటనా స్థలానికి ఏసీపీ రాంబాబు, ద్వారకా స్టేషన్‌ సీఐ ఎస్‌.రమేష్‌, ఎస్‌ఐ ధర్మేంద్ర సిబ్బందితో చేరుకుని విచారణ చేపట్టారు. తమ బిడ్డకు ఎటువంటి సమస్యలు లేవని, భార్య శ్రావణి, పిల్లలతో ఎంతో అన్యోన్యంగా జీవితం సాగిస్తున్నట్టు శంకరరావు తల్లిదండ్రులు చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సీఐ ఎస్‌.రమేష్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఽధర్మేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శంకరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కరెన్సీ చెస్ట్‌లో గల సీసీ కెమెరాల్లో శంకరరావు ఏ విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడో ఫుటేజీ పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ ద్వారా నమునాలను సేకరించారు.

Updated Date - Apr 12 , 2024 | 01:02 AM