సిటీ పోలీస్ కమిషనర్గా శంక బ్రత బాగ్చి
ABN , Publish Date - Jun 29 , 2024 | 01:31 AM
విశాఖ నగర సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ను ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేసింది.
8సీఐడీ ఏడీజీగా రవిశంకర్ అయ్యనార్ బదిలీ
విశాఖపట్నం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి):
విశాఖ నగర సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ను ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేసింది. ఆయన స్థానంలో రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న డాక్టర్ శంక బ్రత
బాగ్చిని నియమించింది. రవిశంకర్ అయ్యన్నార్కు కీలకమైన సీఐడీ ఏడీజీగా నియమించింది.
గత ఏడాది సెప్టెంబరు 14న నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన రవిశంకర్ అయ్యన్నార్కు బదిలీ కానున్నదనే ప్రచారం ప్రభుత్వం మారినప్పటి నుంచి జరుగుతోంది. ఎన్నికల సమయంలో వైసీపీ నేతల కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుమతులు మంజూరుచేసి, కూటమి నేతల సభలు, కార్యక్రమాలకు
ఇబ్బందులు పెట్టారనే ఆరోపణలు సీపీపై ఉన్నాయి. పోలింగ్ జరిగిన తర్వాత కంచరపాలెం బర్మా కాలనీలో టీడీపీకి ఓటేశారనే కారణంతో ఒక కుటుంబంపై కొంతమంది దాడి చేస్తే, ఆ ఘటనకు రాజకీయాలకు సం బంధం లేదని సీపీ తేల్చిపారేశారని కూటమి నేతలు ఆరోపించారు. పైగా దీనిపై ప్రెస్మీట్ పెట్టి ఆ గొడవకు వ్యక్తిగత కక్షలే కారణమని సీపీ చెప్పడమే కాకుండా, డీసీపీ-2తో కూడా చెప్పించారని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో రవిశంకర్ అయ్యన్నార్ బదిలీ ఖాయమని అంతా భావించారు. ఆయన స్థానంలో ప్రభుత్వం పలువురి పేర్లను పరిశీలించింది. చివరకు శంకా బ్రత బాగ్చిని నియమించింది.
కొత్త సీపీది పశ్చిమబెంగాల్ ...
పశ్చిమ బెంగాల్కు చెందిన శంకా బ్రత బాగ్చి 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలుత జమ్మలమడుగు ఏఎస్పీ పనిచేశారు. ఆ తరువాత కడప ఓఎస్డీగా, హైదరాబాద్లో ఏపీఎస్పీ ఒకటవ బెటాలియన్ కమాండెంట్గా, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు జిల్లాల ఎస్పీగా, గ్రేహౌండ్స్ డీఐజీగా, సీఐడీ డీఐజీగా పనిచేశారు. సీబీఐకి డిప్యూటేషన్పై వెళ్లి కోల్కతాలో అత్యంత కీలకమైన కేసులు దర్యాప్తు చేశారు. ఆ తరువాత ఢిల్లీలో సీబీఐ డీఐజీగా సేవలు అందించారు. రాష్ట్ర సర్వీసులకు తిరిగి వచ్చి ఏసీబీ డైరెక్టర్గా, ఏపీఎస్పీ, ఇంటెలిజెన్స్ అడిషినల్ డైరెక్టర్ జనరల్గా, విజిలెన్స్అండ్ ఎన్ఫోర్స్మెంట్, పర్సనల్ అండ్ అడ్మిన్, అగ్నిమాపక శాఖ ఏడీజీగా పనిచేసిన బాగ్చి ప్రస్తుతం శాంతి భద్రతల ఏడీజీగా ఉన్నారు.