ఇసుక తోడేళ్లు
ABN , Publish Date - Apr 25 , 2024 | 01:13 AM
జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లో దర్జాగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇందులో వైసీపీ నాయకుల ప్రమేయం ఉండడంతో రెవెన్యూ, గనులశాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
- నదీ పరివాహక ప్రాంతాల్లో దర్జాగా అనధికార తవ్వకాలు
- వైసీపీ నేతల ప్రమేయం ఉండడంతో పట్టించుకోని అధికారులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లో దర్జాగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇందులో వైసీపీ నాయకుల ప్రమేయం ఉండడంతో రెవెన్యూ, గనులశాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టరు ఇసుక రూ.4 వేలు నుంచి దూరాన్ని బట్టి రూ.6 వేలు వరకు ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు. టైరు బండి ఇసుక అయితే రూ.1500కి అమ్ముతున్నారు. అనకాపల్లి, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలోని కొన్ని గ్రామాల్లో నదుల్లో ఇసుకను రేయింబవళ్లు తవ్వి ట్రాక్టర్లు, టైరు బండ్లలో తరలిస్తున్నారు. ఖాళీ ప్రదేశాల్లో ఇసుకను నిల్వ చేసి విక్రయిస్తున్నారు. అనకాపల్లి, చోడవరం, మాడుగుల మండలాల్లో కొంతమంది స్థానిక వైసీపీ చోటా నాయకులు సొంతంగా పదుల సంఖ్యలో టైర్ బండ్లను ఇసుక రవాణా కోసం వినియోగిస్తున్నారు. వీరికి వైసీపీ పెద్దల అండదండలు ఉండడంతో రెవెన్యూ, గనులశాఖల అధికారులు, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.