Share News

గంగవరం పోర్టులో సేమ్‌ సీన్‌

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:57 AM

గంగవరం పోర్టులో నిర్వాసిత కార్మికుల ఆందోళన పదో రోజుకు చేరింది.

గంగవరం పోర్టులో సేమ్‌ సీన్‌

  • నిలిచిపోయిన కార్యకలాపాలు..

  • కొనసాగుతున్న కార్మికుల ఆందోళన

  • చర్చలకు ముందుకురాని యాజమాన్యం

  • స్టీల్‌ప్లాంటుకు తీరని బొగ్గు కొరత

విశాఖపట్నం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి):

గంగవరం పోర్టులో నిర్వాసిత కార్మికుల ఆందోళన పదో రోజుకు చేరింది. వారి డిమాండ్లను ఆమోదించేందుకు యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. చర్చలు మధ్యలోనే ఆగిపోయాయి. కార్మికులు ఆందోళన కొనసాగిస్తుండడంతో పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బొగ్గు సరఫరా నిలిచిపోవడంతో పలు విభాగాలు షట్‌డౌన్‌ చేసేశారు. సెయిల్‌ నుంచి రెండు దఫాలుగా ఎనిమిది వేల టన్నుల బొగ్గు రావడంతో దానిని ఉపయోగించి శనివారం కోక్‌ ఓవెన్లలో టెంపరేచర్‌ అదే స్థితిలో కొనసాగించే ప్రయత్నం చేయనున్నట్టు ఉక్కు కార్మిక వర్గాలు తెలిపారు. మరోవైపు గంగవరం పోర్టు నుంచి విశాఖ పోర్టుకు చేరిన రెండు నౌకల నుంచి బొగ్గును దిగుమతి చేసి కొంత ర్యాకుల ద్వారా, మరికొంత లారీల ద్వారా స్టీల్‌ప్లాంటుకు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

సమ్మె నోటీసు ఇవ్వలేదని పోర్టు నాటకం

స్టీల్‌ప్లాంటుకు ముడిసరకులు అందించాల్సిన బాధ్యత అదానీ గంగవరం పోర్టుది. దానిని యాజమాన్యం విస్మరించింది. పోర్టులో కార్మికులు 21 రోజుల ముందుగా నోటీసు ఇచ్చి సమ్మెకు దిగాల్సి ఉంటుందని, కానీ వారు అలా చేయలేదని, మెరుపు సమ్మెకు దిగడం వల్ల తాము ముందస్తు ఏర్పాట్లు చేయలేదని ఉక్కు యాజమాన్యానికి లేఖ రాసింది. ఏ సమ్మె అయినా దాని ఫలితంగా సరకు సరఫరా ఆగిపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్నా దానిని తప్పించుకుంటున్నదని ఉక్కు అధికార, కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. సమ్మెను విరమింపజేయడానికి పోర్టు యాజమాన్యం ఎటువంటి చొరవ చూపడం లేదని, జిల్లా అధికారులే సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారని, ఇదైన సరైన విధానం కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 20 , 2024 | 01:57 AM