నామినేషన్ల జోరు
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:47 AM
జిల్లాలో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి 15 నామినేషన్లు, అసెంబ్లీ స్థానాలకు 24 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల గడువు గురువారంతో ముగియనుంది. కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవి పట్టన్శెట్టికి బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ నామినేషన్ పత్రాన్ని అందజేశారు.
- పార్లమెంట్ స్థానానికి 15..
- అసెంబ్లీ స్థానాలకు 24 దాఖలు
- నేటితో ముగియనున్న గడువు
అనకాపల్లి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి 15 నామినేషన్లు, అసెంబ్లీ స్థానాలకు 24 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల గడువు గురువారంతో ముగియనుంది. కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవి పట్టన్శెట్టికి బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ నామినేషన్ పత్రాన్ని అందజేశారు.
కాంగ్రెస్ తరఫున గరా సూర్యారావు, ఇదే పార్టీ నుంచి వేగి వెంకటేశ్, స్వతంత్ర అభ్యర్థిగా తుంపాల హరిశంకర్, దళిత బహుజన పార్టీ తరఫున కృష్ణస్వరూప్ వడ్లమూరి, వైసీపీ తరఫున భీశెట్టి వెంకట సత్యవతి, ఇదే పార్టీ తరఫున బూడి ముత్యాలనాయుడు కూడా నామినేషన్ పత్రాలను అందజేశారు. అలాగే బహుజన సమాజ్పార్టీ తరఫున పలకా శ్రీరామ్మూర్తి, భారత చైతన్య యువజన పార్టీ తరఫున నమ్మి అప్పలరాజు నామినేషన్లు దాఖలు చేశారు.
అసెంబ్లీ స్థానాలకు..
అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా కె.సత్యనారాయణ, వైసీపీ తరఫున మలసాల భరత్కుమార్, అదే పార్టీ తరఫున నివేదిత గంగుపాం, జనసేన పార్టీ తరఫున కొణతాల రామకృష్ణ అదనపు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఎలమంచిలి అసెంబ్లీ స్థానానికి లంబా శ్రీనివాసరావు(బీఎస్పీ), డి.పూర్ణచంద్రరావు(జై భారత్ నేషనల్ పార్టీ), ప్రగడ అన్నపూర్ణ(టీడీపీ), మేరుగు రాజుబాబు(స్వతంత్ర), సుందరపు విజయ్కుమార్ జనసేన పార్టీ తరఫున రెండు సెట్లు, యు.సుకుమారవర్మ(వైసీపీ) నాలుగు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. మాడుగుల అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరఫున బండారు సత్యనారాయణమూర్తి సతీమణి మాధవీలత డమ్మీ నామినేషన్ వేశారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా మళ్ల ఆరినాయుడు, బూడి రవికుమార్, మళ్లారపు లోవ, పైలా ప్రసాదరావు నామినేషన్లు దాఖలు చేశారు. పాయకరావుపేట అసెంబ్లీ స్థానానికి దళిత బహుజన పార్టీ తరఫున వడ్లమూరి కృష్ణ స్వరూప్, కాంగ్రెస్ తరఫున బోని తాతారావు, స్వతంత్ర అభ్యర్థిగా మారుతి నారాయణ చక్రవర్తి నామినేషన్లు దాఖలు చేశారు. నర్సీపట్నం అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ తరఫున రుత్తల శ్రీరామ్మూర్తి, బీఎస్పీ తరఫున బొట్ట నాగరాజు, వైసీపీ తరఫున పెట్ల కళావతి తమ నామినేషన్లు దాఖలు చేశారు. వీరంతా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు తమ నామినేషన్లు అందజేశారు. కాగా పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్వో శేష శైలజకు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు నామినేషన్ పత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, గండి బాబ్జీ, జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు బీజేపీ ఇన్చార్జి సీఎం శ్రీనివాసులనాయుడు పంచకర్ల అభ్యర్థిత్వాన్ని బలపరిచారు.