మొరాయించిన ఆర్టీసీ బస్సులు
ABN , Publish Date - Mar 27 , 2024 | 12:47 AM
నర్సీపట్నం నుంచి సీలేరు, గుమ్మిరేవుల ప్రాంతాలకు వెళ్లే రెండు ఆర్టీసీ బస్సులు మంగళవారం ఉదయం ధారకొండ ఘాట్లో మరమ్మతులకు గురై నిలిచిపోయాయి. దీంతో విధులకు వెళ్లాల్సిన ఉద్యోగులు, ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
![మొరాయించిన ఆర్టీసీ బస్సులు](https://media.andhrajyothy.com/media/2024/20240326/26_SLR_1_9771c8b3fb.jpg)
మరమ్మతులకు గురై ధారకొండ ఘాట్లో నిలిచిన రెండు బస్సులు
- ప్రయాణికుల అవస్థలు
సీలేరు, మార్చి 26: నర్సీపట్నం నుంచి సీలేరు, గుమ్మిరేవుల ప్రాంతాలకు వెళ్లే రెండు ఆర్టీసీ బస్సులు మంగళవారం ఉదయం ధారకొండ ఘాట్లో మరమ్మతులకు గురై నిలిచిపోయాయి. దీంతో విధులకు వెళ్లాల్సిన ఉద్యోగులు, ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నర్సీపట్నం ఆర్టీసీ డిపోనకు చెందిన గుమ్మిరేవుల బస్సు ప్రతి రోజు ఉదయం నాలుగున్నర గంటలకు, సీలేరు సర్వీసు బస్సు ఉదయం 5:45 గంటలకు బయలుదేరతాయి. రోజూ నర్సీపట్నం, చింతపల్లి, జీకేవీధి ప్రాంతాల నుంచి సీలేరు, ధారకొండ, సప్పర్ల తదితర ప్రాంతాల్లో పనిచేసే వివిధ శాఖల ఉద్యోగులు, ఈ ప్రాంతవాసులు ఈ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. మంగళవారం ఉదయం ఈ రెండు బస్సులు ధారకొండ ఘాట్ వద్ద వేర్వేరు ప్రాంతాల్లో ఆగిపోవడంతో నాలుగు గంటలు ఆలస్యంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ వాహనాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఘాట్ వద్ద అల్పాహారం, మంచినీళ్లు దొరకక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు గిరిజన ప్రాంతాలకు కండీషన్లో ఉన్న ఆర్టీసీ బస్సులను పంపించాలని ఈ ప్రాంతవాసులు, ఉద్యోగులు కోరారు.