పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పించండి
ABN , Publish Date - Feb 28 , 2024 | 12:59 AM
పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పించండి
![పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పించండి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఫొటో రైటప్: 27పిడిఆర్ 1:
- అధికారులకు జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట్ ఆదేశాలు
పాడేరు, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): పోలింగ్ కేంద్రాలకు విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు వంటి కనీస వసతులను సమకూర్చాలని జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట్ ఆదేశించారు. పాడేరు నియోజకవర్గంలోని ఆరు మండలాల తహసీల్దార్లు, సెక్టర్ అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సౌకర్యాలపై కచ్చితమైన సమాచారం అందించాలన్నారు. అలాగే సెక్టార్ అధికారులు పోలింగ్ సిబ్బంది రవాణాకు అవసరమైన బస్సులు, జీపులకు ప్రతిపాదనలు ఇచ్చారని, ఆయా రూట్లలో బస్సులు, జీపులు వెళ్లడానికి అనుకూలంగా ఉన్నది?, లేనిది పరిశీలించాలని ఆమె సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోని అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన వెలుతురు ఉండేలా విద్యుత్ సౌకర్యం కల్పించాలని, ప్రస్తుతం మరుగుదొడ్లు లేకపోతే కొత్తగా మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రూ.20 వేల వ్యయంతో మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. పోలింగ్ కేంద్రాల పైకప్పులు సక్రమంగా లేకపోతే మరమ్మతులు చేయడానికి నిధులు ఇస్తామన్నారు. పోలింగ్ కేంద్రాలు గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు రెండు వందల మీటర్ల దూరంలో రాజకీయ పార్టీల కార్యాలయాలు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.అంబేడ్కర్, పాడేరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన తహసీల్దార్లు, సెక్టర్ అధికారులు పాల్గొన్నారు.