5న పవన్ కల్యాణ్ పర్యటన
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:37 AM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈనెల ఐదో తేదీన అనకాపల్లిలో పర్యటించనున్నారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ తెలిపారు.

అనకాపల్లిలో వారాహి విజయయాత్ర
మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం
సాయంత్రం నెహ్రూచౌక్ కూడలిలో బహిరంగ సభ
మూడు పార్టీల నేతల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు
కొత్తూరు, ఏప్రిల్ 2: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈనెల ఐదో తేదీన అనకాపల్లిలో పర్యటించనున్నారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ తెలిపారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఈ నెల 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి యాత్రను నిర్వహించడంతో పాటు పలు బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. పర్యటనలో భాగంగా ఐదో తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు పవన్ కల్యాణ్ వారాహి యాత్ర అనకాపల్లి సుంకరమెట్ట కూడలి వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మెయిన్ రోడ్డు గుండా సాగి నెహ్రూచౌక్ కూడలికి చేరుకుంటుంది. సాయంత్రం అక్కడ భారీ బహిరంగ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కూటమిలోని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్చరణ్, చిరంజీవి అభిమానులు, కార్మిక, కర్షక, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కొణతాల కోరారు.