Share News

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:34 AM

ఇంటికి పన్ను వేసేందుకు రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి, ఆయన సహాయకుడు గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు.

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

ఇంటి పన్ను కోసం లంచం డిమాండ్‌

పెందుర్తి, ఏప్రిల్‌ 18:

ఇంటికి పన్ను వేసేందుకు రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి, ఆయన సహాయకుడు గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఇందుకు సంబంధించి బాధితుడు అందజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ నగర వాసి ఒకరికి మండలంలోని వాలిమెరకజుత్తాడలో ఇల్లు ఉంది. అది ఆయన తల్లి పేరిట ఉంది. ఆ ఇంటికి పన్ను నిర్ధారిత పత్రం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. అందుకోసం రూ.8 వేలు లంచం ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి వి.సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని నగర వాసి...ఏసీబీ అధికారులును ఆశ్రయించారు. వారి సూచన మేరకు బాధితుడు గురువారం పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి సత్యనారాయణ, ఆయన సహాయకుడు కొర్ర విక్టర్‌ ప్రవీణ్‌లకు రూ.8 వేలు అందజేశారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు కార్యాలయంలో ప్రవేశించి రెడ్‌హ్యాండెడ్‌గా కార్యదర్శిని పట్టుకున్నారు. పంచాయతీ కార్యదర్శి తనను రూ.8 వేలు డిమాండ్‌ చేయగా, తాను రూ.3 వేలు ఇస్తానన్నానని, రూ.8 వేలు ఇవ్వకపోతే ఇంటి పన్ను వేసేది లేదని చెప్పడంతో ఏసీబీ కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేసినట్టు బాధితుడు తెలిపారు. కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదును నమోదు చేసుకుని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ అధికారులు ఈ దాడులు నిర్వహించారు.

Updated Date - Apr 19 , 2024 | 01:34 AM