భక్తులతో కిటకిటలాడిన నూకాంబిక ఆలయం
ABN , Publish Date - May 20 , 2024 | 12:25 AM
స్థానిక నూకాంబిక ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.
![భక్తులతో కిటకిటలాడిన నూకాంబిక ఆలయం](https://media.andhrajyothy.com/media/2024/20240511/19akp_town_1_3c57d12b4e.jpg)
అనకాపల్లి టౌన్, మే 19 : స్థానిక నూకాంబిక ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున ఆరు గంటలకు ఆలయ అర్చకులు బాలాలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం నుంచే అమ్మవారి ఆలయానికి వచ్చే రహదారులు భక్తులతో సందడిగా మారాయి. క్యూలైన్ లు అన్ని నిండిపోయాయి. ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే చాలా మంది భక్తులు అమ్మవారి పండగను చేసుకుని ఘటాలతో ఆలయానికి వచ్చి అమ్మవారికి ఘటాలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. అలాగే ఆలయ ఆవరణలో భక్తులు వంటలు తయారుచేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టి కుటుంబసమేతంగా అందరూ కలిసి భోజనాలు చేశారు. ఉష్ణోగ్రత కారణంగా ఆలయంలోని భక్తులకు ఆలయ అధికారులు చల్లటి మంచినీటిని క్యూలో ఉన్న వారికి అందజేశారు. అలాగే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు చల్లటి మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో బండారు ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది చర్యలు తీసుకున్నారు. అలాగే ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.