జోరుగా నామినేషన్లు
ABN , Publish Date - Apr 25 , 2024 | 01:43 AM
విశాఖ పార్లమెంటు నియోజకవర్గంతోపాటు అసెంబ్లీ స్థానాలకు బుధవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.
ఒక్కరోజే విశాఖ పార్లమెంటు స్థానానికి ఎనిమిది మంది...
ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు 44 మంది
63 సెట్లు నామినేషన్లు దాఖలు
పెతకంశెట్టి గణబాబు, పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేశ్బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, ముత్తంశెట్టి, ఎంవీవీ, గుడివాడ అమర్నాథ్ నామినేషన్లు
భారీ ర్యాలీలతో సందడి
విశాఖపట్నం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి):
విశాఖ పార్లమెంటు నియోజకవర్గంతోపాటు అసెంబ్లీ స్థానాలకు బుధవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో పాటు బుధవారం మంచిరోజు కావడంతో పెద్దఎత్తున అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. బుధవారం ఒక్కరోజే విశాఖ పార్లమెంటు స్థానానికి ఎనిమిది మంది అభ్యర్థులు, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు 44 మంది అభ్యర్థులు 63 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల నామినేషన్లతో నగరంలో కోలాహలం నెలకొంది.
పార్లమెంటు స్థానానికి ఏడో రోజు బుధవారం ఎనిమిది నామినేషన్లు దాఖలు వచ్చాయి. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ నుంచి కొంగరాపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి మురపాల అచ్యుతకిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరపున మురాల అరుణశ్రీ, జై మహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులుగా కర్రి వేణుమాధవ్, గాదం అప్పల నరసింహఆనంద్లు పార్లమెంటు నియోజకవర్గ ఆర్వో, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునకు పత్రాలు అందజేశారు. బహుజన్ సమాజ్వాదీ పార్టీ తరపున పెదపెంకి శివప్రసాద్, భారతీయ రాష్ట్రీయ దళ్ నుంచి గుంటు దుర్గాప్రసాద్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున పొలమరశెట్టి సత్యవతి, సమాజ్వాదీ పార్టీ నుంచి జాలాది విజయకుమారి, వైసీపీ తరపున బొత్స ఝాన్సీలక్ష్మి, బొత్స అనూష తరపున కోలా గురువులు మరొక సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఏడు అసెంబ్లీ స్థానాలకు 44 మంది నామినేషన్
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బుధవారం 44 మంది 63 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తూర్పు నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా ముళ్లపూడి వీరవెంకట సత్యనారాయణ (ఎంవీవీ సత్యనారాయణ) రెండు సెట్లు, ముళ్లపూడి నాగజ్యోతి రెండు సెట్లు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఇ.హైమావతి ఒక సెట్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి డాక్టర్ గణపతి కొంగరపు, స్వతంత్ర అభ్యర్థిగా బర్ల అప్పల పద్మాకర్, బహుజన సమాజ్వాదీ పార్టీ నుంచి ఇ పీటర్ జోసెఫ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి గుత్తుల శ్రీనివాసరావు, గుత్తుల మోనిక ఒక్కొక్క సెట్ నామినేషన్ దాఖలు చేశారు. భీమిలికి వైసీపీ నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నాలుగు సెట్లు, ముత్తంశెట్టి జ్ఞానేశ్వరి రెండు సెట్లు, జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ఎల్లిపిల్లి అనిల్కుమార్, ప్రజాప్రస్థానం నుంచి దాసరి లక్ష్మి సంధ్య, స్వతంత్ర అభ్యర్థులుగా నొక్కల సూర్యప్రకాశ్, ఏలూరు ధర్మావతి, సమాజ్వాదీ పార్టీ నుంచి చోడిపల్లి రాజు ఒక్కొక్క సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు తరపున మరొక సెట్ అందింది. ఉత్తర నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా కమ్మిల కన్నపరాజు రెండు సెట్లు, కమ్మిల సుమ, స్వతంత్ర అభ్యర్థులుగా చింతల మల్లికార్జునరావు, వడ్డి శిరీష, ప్రజా ప్రస్థానం పార్టీ నుంచి కందుల బాలాజీ ఒక్కొక్క సెట్ నామినేషన్ దాఖలు చేశారు. దక్షిణ నియోజక వర్గానికి జనసేన పార్టీ నుంచి చెన్నుబోయిన శ్రీనివాసరావు రెండు సెట్లు, స్వతంత్ర అభ్యర్థిగా చెన్నబోయిన పద్మజ ఒక సెట్, వైసీపీ నుంచి వాసుపల్లి ఉషారాణి రెండు సెట్లు, స్వతంత్ర అభ్యర్థిగా బి.రోహిత్కుమార్జైన్ ఒక సెట్, బహుజన సమాజ్వాదీ పార్టీ నుంచి కదిరి రాము రెండు సెట్లు, భారతీయ రాష్ట్రీయ దళ్ అభ్యర్థిగా గుంటు దుర్గాప్రసాద్, ప్రజా ప్రస్థానం పార్టీ నుంచి బురు శ్రీనివాసరావు ఒక్కొక్క సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.పెందుర్తి నియోజక వర్గానికి జనసేన పార్టీ అభ్యర్థిగా పంచకర్ల రమేష్బాబు మూడు సెట్లు, పంచకర్ల వెంకటేశ్వరరావు ఒక సెట్, పంచకర్ల మహలక్ష్మి ఒక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. అలాగే బహుజన్ సమాజ్వాదీ పార్టీ నుంచి బంగరి రమణ, స్వతంత్ర అభ్యర్థిగా వడ్డాది ఉదయ్కుమార్ ఒక సెట్ దాఖలు చేశారు. గాజువాక నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ నుంచి పల్లా శ్రీనివాసరావు మూడు సెట్లు, వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ రెండు సెట్లు, రంగూరి హిమగౌరి రెండు సెట్లు, లోక్తాంత్రిక్ జనతా పార్టీ నుంచి తోట అక్కయ్య రెండు సెట్లు, స్వతంత్ర అభ్యర్థిగా గవర రోహిణికుమారి ఒక సెట్ సమర్పించారు. పశ్చిమ నియోజకవర్గానికి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పీవీజీఆర్ నాయుడు మూడు సెట్లు, పెతకంశెట్టి మౌర్య సింహ ఒక సెట్, వైసీపీ నుంచి ఆడారి మాలతి, స్వతంత్ర అభ్యర్థిగా పిళ్లా రమాకుమారి, సమాజ్వాదీ పార్టీ నుంచి వెలగాడ రవికుమార్, స్వతంత్ర అభ్యర్థిగా జమ్మి పార్వతి ఒక్కొక్క సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.